భారత్ లో అమెరికా కిరాయి సైనికుడు అరెస్ట్

భారత్ లో అమెరికా కిరాయి సైనికుడు అరెస్ట్

అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్‌ ను భారత్‌లో అరెస్ట్‌ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ వెల్లడించింది. మాథ్యూ వాన్‌డైక్‌ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి చెందినవాడు.

అతను తనను తాను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, సైనికుడిగా, వార్ కరస్పాండెంట్‌గా‌, కాలమిస్ట్‌గా వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ది బాల్టిమోర్ ఎగ్జామినర్ మీడియా సంస్థకు వార్‌ కరస్పాండెంట్‌ (యుద్ధవార్తలను కవర్‌ చేసే జర్నలిస్ట్) గా పనిచేసినప్పుడు ఇరాక్‌లో అమెరికా దళాలతో కలిసి ఉన్నాడు.  తాను లిబియా విప్లవంలో పాల్గొన్నానని, అప్పుడు పట్టుబడి జైలుశిక్ష అనుభవించానని చెబుతుంటాడు.

అతను ఒక మిలిటరీ కాంట్రాక్ట్ కంపెనీ సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ (సోలి) ను స్థాపించాడు. తన సంస్థ సోలి ఉగ్రవాదం, అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాతున్న వారికి ఉచిత భద్రత, శిక్షణ అందించే లాభాపేక్ష లేని సంస్థ అని పేర్కొన్నాడు.  డ్రోన్‌ వార్‌ఫేర్ ట్రెయినింగ్‌, అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నించడం, ఈశాన్య భారత్‌కు సమీపంలో చురుగ్గా ఉన్న సాయుధ గ్రూపులతో సంబంధాల నేపథ్యంలో ఎన్‌ఐఏ అతడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నేరం కింద కేసు నమోదు చేసింది. 

ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించడం, కుట్రపన్నడం వంటి అభియోగాలు నమోదైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడయ్యాయి.  నిందితులు వేర్వేరు తేదీల్లో సరైన పత్రాలు లేకుండానే భారత్‌లోని మిజోరాం రాష్ట్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మయన్మార్‌లోని సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రూప్‌లకు డ్రోన్‌ వార్‌ఫేర్ ట్రెయినింగ్‌ ఇవ్వాలన్నది వీరి లక్ష్యమని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.