అమెరికా కీలక నేతల నివాసాలపై డ్రోన్‌ల కలకలం

అమెరికా కీలక నేతల నివాసాలపై డ్రోన్‌ల కలకలం

అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు నేతల నివాసాలపై డ్రోన్‌లు  సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది.  వాషింగ్టన్, డి.సి.లోని ఒక కీలకమైన యూఎస్ ఆర్మీ స్థావరంపై అనుమానాస్పద డ్రోన్లు కనిపించడంతో, భద్రతా హెచ్చరిక జారీ అయింది.  ప్రపంచవ్యాప్తంగా భద్రతా ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, పలు దేశీయ సైనిక స్థావరాలను లాక్‌డౌన్‌లో ఉంచారు.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాలు, దౌత్య కార్యాలయాల్లో అప్రమత్తతను పెంచారు.  ది వాషింగ్టన్ పోస్ట్ కధనం ప్రకారం, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్‌కు సమీపంలో ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరం ఫోర్ట్ లెస్లీ జె. మెక్‌నైర్‌పై అనేక గుర్తుతెలియని డ్రోన్లను గుర్తించారు. ఈ స్థావరంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యుద్ధ మంత్రి పీట్ హెగ్‌సెత్‌తో సహా యూఎస్ ఉన్నతాధికారులు కూడా నివసిస్తున్నట్లు సమాచారం. 

ఈ విషయంతో పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ, డ్రోన్ల మూలం, వాటి గుర్తింపు ఇంకా తెలియరాలేదని, ఇది యూఎస్ భద్రతా వర్గాల్లో ఆందోళనలను పెంచుతోందని తెలిపారు. గత 10 రోజులుగా, ఒకే రాత్రి ఆ స్థావరంపై అనేక డ్రోన్లు కనిపించాయని, దీంతో నిఘా పెంచడంతో పాటు వైట్ హౌస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారని నివేదికలు చెబుతున్నాయి.

వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరాల వద్ద గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 20 డ్రోన్‌లు గుంపులుగా ఏర్పడి, తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్‌లను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది అధికారులకు అంతుచిక్కడం లేదు. గుర్తించడం, అడ్డుకోవడం కష్టతరమైన డ్రోన్‌ల వంటి నూతన ముప్పుల నేపథ్యంలో, ఇది భద్రతా సంస్థలలో ఆందోళనలను రేకెత్తించింది.

ఇవి సాధారణ వాణిజ్య డ్రోన్ల కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుండటంతో వాటిని అడ్డుకోవడం సవాలుగా మారింది. ఈ ఘటనలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగరేషన్ (ఎఫ్ బి ఐ), పెంటగాన్ ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. కీలక నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ లేదా ఇతర విదేశీ శక్తులు ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. 

పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమైన వేళ అమెరికా గడ్డపైనే ఇలాంటి నిఘా నీడలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం నిఘా కోసమా? లేదంటే భవిష్యత్తులో ఏదైనా దాడికి సంబంధించిన సన్నాహక చర్యనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెరుగుతున్న భద్రతాపరమైన ముప్పుల కారణంగా పలువురు ఉన్నతాధికారులు సాంప్రదాయ ప్రభుత్వ గృహాలకు బదులుగా సైనిక స్థావరాలలోనే నివసించడానికి మొగ్గు చూపుతున్నారనే విస్తృత ధోరణిని కూడా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.