మిస్సింగ్‌ కేసులు పెరగటంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆందోళన

మిస్సింగ్‌ కేసులు పెరగటంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆందోళన
దేశంలో మిస్సింగ్‌ కేసులు పెరగటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆందోళన వ్యక్తం చేసింది. అనేక రాష్ట్రాల్లో మిస్సింగ్‌ కేసులు పెరుగుతున్నాయని, తప్పిపోతున్న వారి ఆచూకీ కనిపెట్టటంలో విఫలమవుతున్నారని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా స్వీకరించింది. 

ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణతోపాటు బీహార్‌, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకు నోటీసులు పంపింది. వార్తా కథనాల ప్రకారం బీహార్‌లో 2013 నుంచి ప్రతి సంవత్సరం 12వేల నుంచి 14వేల వరకు మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

వీటిలో పిల్లలకు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయి. అదృశ్యమైన చిన్నారుల్లో తక్కువమంది ఆచూకీ మాత్రమే కనుగొంటున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, బీహార్‌, తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయి. 

అదృశ్యమైన చిన్నారులు భిక్షాటన, వెట్టిచాకిరీ చేయించడం, వ్యభిచారం తదితర అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టివేయబడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి నిజమైతే ఇది మానవ హక్కుల రల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. సంబంధిత రాష్ట్రాలు మిస్సింగ్‌ కేసులను తగ్గించడానికి తీసుకున్న చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.