ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమరు సంక్షోభం తలెత్తి ప్రపంచ దేశాలు అట్టుడికి పోతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది.
దేశంలో చమరు నిల్వలు కేవలం రెండు వారాలకు సరిపడా మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు పాకిస్థాన్ లాక్ డౌన్ తరహా నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. విద్యార్థులకు పాఠాలను ఆన్ లైన్ విధానంలో బోధిస్తున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. ఇక పాకిస్థాన్ లో పెట్రోల్ ధర రూ. 320 కు పైగానే ఉంది. దాంతో వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు.
ఈ క్లిష్ట సమయంలో పాకిస్థాన్ కు పిడుగు లాంటి వార్త అందించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్). పాకిస్థాన్ కు రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. ఇన్ని రోజులూ అప్పు చేసి పప్పు కూడులా కాలం వెల్లదీస్తున్న పాకిస్థాన్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. తాజాగా పాకిస్థాన్, ఐఎంఎఫ్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో 1 బిలియన్ డాలర్లను గతంలో ఇచ్చేందుకు అంగీకరించిన ఐఎంఎఫ్ ఇప్పుడు దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ రుణానికి కాళ్లు అడ్డం పెట్టింది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం దేశ ప్రజల నుంచి వస్తున్న పన్ను వసూళ్లు, అలాగే పాకిస్థాన్ కరెంట్ బడ్జెట్ నిల్వలపై అనుమానం వ్యక్తం చేసిన ఈ అంతర్జాతీయ సంస్థ ఆ దేశానికి నిధులు ఇచ్చేందుకు మొండి చేయి చూపింది. పాకిస్థాన్ రెవెన్యూ లక్ష్యాలను అందుకోవడంలో విఫలం అయిందని, అందువల్ల ఆ దేశానికి రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ నిరాకరించిందని కరాచీకు చెందిన ఓ బిజినెస్ పత్రిక వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే పాకిస్థాన్ లో టాక్స్ టూ జీడీపీ రేషియో 9-10 శాతం మధ్యలోనే ఉంది. దేశంలోని ఎకానమీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. తదితర కారణాలను ఎత్తి చూపిన ఐఎంఎఫ్.. ఈ మేరకు పాకిస్థాన్ కు రుణం అందించేందుకు వెనకడుగు వేసింది. దాంతో పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.

More Stories
ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రేషన్ షాపుల్లో కిరోసిన్!
వాణిజ్య ఎల్పీజీ సీలిండర్ల పంపిణి తిరిగి ప్రారంభం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు ప్రచారంలో నిజం లేదు