బెంగాల్ కు ‘మహా జంగిల్రాజ్’ పాలనను తీసుకొచ్చిన వారికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిరంకుశ టీఎంసీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, ‘మార్పు అనే తుపాను’ను ఆపలేదని స్పష్టం చేశారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లోని భారీ జనసమూహమే ఇందుకు నిదర్శనమని చెబుతూ బెంగాల్ లో మళ్లీ చట్టబద్ధమైన పాలన వస్తుందని, అప్పుడు దురాగతాలకు పాల్పడిన టీఎంసీ నాయకులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
“టీఎంసీ ప్రభుత్వం తాను పనిచేయదు, ఇతరులు పనిచేయడానికి అనుమతించదని, అందుకే బెంగాల్ లో అనేక కేంద్ర పథకాలు నిలిచిపోయాయని’ మోదీ ఆరోపించారు. బంగాల్లో మార్పు ఆసన్నమైందని గ్రహించిన టీఎంసీ కలవరపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే ఈ ర్యాలీకి రాకుండా ప్రజలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
అయితే ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ ప్రజలు ర్యాలీకి హాజరుకాకుండా మమతా సర్కార్ ఆపలేకపోయిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, టీఎంసీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి రక్షణ కల్పిస్తోందని, ఇందుకు సందేశ్ ఖలి, ఆర్జీ కర్ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. టీఎంసీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల, చంద్రకోనకు చెందిన బంగాళాదుంప రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగాల్ లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం ఈ బంగాల్ నుంచే లిఖించబడుతోందని తెలిపారు. అలాగే ఖరగ్పూర్-మోరెగ్రామ్ ఎకనామిక్ కారిడార్కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
‘కాంగ్రెస్ పార్టీకి అసోం గురించి గానీ, దేశం గురించి గానీ ఎలాంటి విజన్ (దూరదృష్టి) లేదు. నన్ను దూషించడం, అబద్ధాలు, వదంతులు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే ఆ పార్టీ వారికి తెలుసు’ అని మోదీ విమర్శించారు.

More Stories
బిన్నీ, ద్రవిడ్, మిథాలీలకు లైఫ్టైమ్ పురస్కారాలు
ప్రముఖ తమిళకవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సజీవంగా ఉన్నారా?