రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో కాల్పుల కలకలం

రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో కాల్పుల కలకలం
* పార్టీలో టిడిపి ఎంపీ… ఐదుగురికి పాజిటివ్
 
మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. పక్కా సమాచారంతో పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్ అధికారులు ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఏలూరు టిడిపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సైతం ఉన్నారు.
 
పోలీసులు రాగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా పోలీసులను భయపెట్టడానికి కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తుపాకీ పైలట్ రోహిత్‌ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు.  ఇక ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ డ్రగ్ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ రాగా, ఎంపీ పుట్టా మహేష్‌కి మాత్రం నెగెటివ్ వచ్చింది. పైలట్ రోహిత్‌, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్‌ రవి, అర్జున్‌ రెడ్డికి పాజిటివ్‌ వచ్చింది. పార్టీలో పట్టుబడిన 10 మందిలో ఓ మహిళ సైతం ఉంది..కౌశిక్‌ రవితో కలిసి ఆ మహిళ వచ్చింది. డ్రగ్స్‌తో పాటు ఫామ్‌ హౌస్‌ లోపల ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా పైప్స్ సైతం దొరికాయి. పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో కొందరు వారం కిందట సిమ్లా నుంచి వచ్చామని చెబుతున్నారు.
మరికొందరి గోవా నుంచి వచ్చామని చెబుతున్నారు.  ఫామ్‌హౌస్​లో రాత్రి 9:30 నుంచి ఉదయం 2 గంటల వరకు తనిఖీలు చేసి మద్యం బాటిళ్లతో పాటు 2గ్రాముల వైట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశారు. అందరి బ్లెడ్‌ శాంపిల్స్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కి పంపించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వెల్లడించారు.
 
డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో మొదట ఈగల్ టీమ్ సిబ్బంది ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. తనిఖీ చేయడానికి అంగీకరించలేదు. లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఓటీ అధికారులను పిలిపించారు.పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులను చూడగానే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ఒక రౌండ్ పాటు గాలిలో కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది.