ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్ లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. 
 
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అనంతరం ఏపీ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ వ్యవహరించనున్నారు. జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్ కాగా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ, ఎల్ ఎల్ ఎం పూర్తి చేశారు. 
 
1990లో న్యాయవాదిగా పంజాబ్ హర్యానా హైకోర్టులో ప్రాక్ట్రీస్ ప్రారంభించారు.2014 మార్చి 31న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.  ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా.. ప్రస్తుతం 33 మంది ఉన్నారు. జస్టిస్ లిసా గిల్ రాకతో ఈ సంఖ్య 34కు పెరిగింది.
 
ఈకార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడిషనల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేవీ రఘు కుమార్, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.