ఇరాన్ ప్రధాన భూభాగం నుండి 50 కి.మీ దూరంలో ఉన్న పర్షియన్ గల్ఫ్లోని ఐదు మైళ్ల పొడవైన పగడపు దీవి అయిన ఖార్గ్ ద్వీపం “భారీగా బాంబు దాడికి గురైంది”. ఇరాన్ చమురు ఎగుమతులన్నీ దాదాపు ఆ ద్వీపం గుండా ప్రవహిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశంలో దాదాపు 5,000 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఖార్గ్ తప్పించుకుంది.
మరోవంక, పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచమంతా చమురు ధరలు పెరుగుతున్న వేళ రష్యాపై ఉన్న పలు ఆంక్షలను అమెరికా సడలించింది. భారత్తో సహా పలు దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్పై ఒత్తిడి తీసుకొచ్చిన అమెరికానే ఇప్పుడు ప్రపంచ దేశాలను క్రూడ్ ఆయిల్ కొనాలని కోరుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలని నెలల తరబడి భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చిందని అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అయితే ఇరాన్తో రెండు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం తర్వాత అదే వైట్ హౌస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను రష్యా చమురు కొనాలని కోరుతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధానికి మద్దతు ఇస్తున్న యూరప్ దేశాలపై కూడా అరాగ్చీ విమర్శలు గుప్పించారు. ఇరాన్పై జరుగుతున్న చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతు ఇస్తే రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తమకు మద్దతు చేస్తుందని యూరప్ భావించిందని, అయితే ఆ అంచనాలు తప్పాయని ఆయన విమర్శించారు.
హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయలేదు
కాగా, హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయలేదని, ఇప్పటికీ కొన్ని నౌకలు దాని మీదుగా రాకపోకలను కొనసాగిస్తున్నాయని భారత్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల వల్ల నౌకలు హర్మూజ్ను దాటడంలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. ఆ జలసంధిని మూసివేయాలని ఇరాన్ అస్సలు కోరుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్లు అన్యాయంగా ఇరాన్పై రుద్దిన ఈ యుద్ధం వల్ల ముడి చమురు, ఇంధన ధరలు పెరిగిపోయి ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాల నేతలంతా ఏకమై ఇరాన్పై యుద్ధాన్ని ఆపమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడిని పెంచాలని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ డిమాండ్ చేశారు. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిన వాళ్లే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ హోర్ముజ్ జలసంధి ద్వారా భారత్కు వేళ్లే నౌకలకు సురక్షిత మార్గం కల్పించనున్నట్లు భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హోర్ముజ్లో భారత్ నౌకలకు సురక్షిత ట్రాన్సిట్ అనుమతిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఫతాలి భారత్ తమకు మంచి స్నేహితుడిని వారికి సురక్షిత మార్గం కల్పిస్తామని ధ్రువీకరించారు.

More Stories
అస్సాం సీఎం భార్యకు మూడు విదేశీ పాస్పోర్ట్లు సృష్టించిన కాంగ్రెస్!
పదవులకోసం పార్టీ మారే వ్యక్తిని కాదు
భారత్ సమీప జలాల్లో చైనా `సర్వే’ నౌకలు!