ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా

ఇండిగో సీఈవో పీటర్ ఎల్బెర్స్ రాజీనామా
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ రాజీనామా చేశారు. నిరుడు డిసెంబర్‌లో ఇండిగో చరిత్రలోనే తీవ్రమైన సంక్షోభం సమయంలో విమర్శల పాలైన ఆయన ఎట్టకేలకు సీఈఓ బాధ్యతల నుంచి మంగళవారం వైదొలిగారు. పీటర్ తప్పుకున్నందున తదుపరి సీఈవో ఎవరు? అనే ప్రశ్న ఎదురవ్వకుండా చూసుకుంది యాజమాన్యం.

ఇండిగో సంక్షోభం సమయంలో తీవ్ర విమర్శల పాలైన సీఈవో పీటర్ అల్బెర్స్ మూడు నెలల తర్వాత రాజీనామా చేశారు.  ఇప్పటికిప్పుడు కొత్తవారిని నియమించకుండా  తాత్కాలిక సీఈవోగా రాహుల్ భాటియా  కొనసాగుతారని ఇండిగో తెలిపింది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న భాటియా కొన్ని రోజులు తమ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటారని సంస్థ పేర్కొంది.

నిరుడు డిసెంబర్‌ ప్రారంభంలో ఇండిగో సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసింది. విమాన విధుల సమయ పరిమితి(ఎఫ్‌డీటీఎల్‌) ఆచరణలో సంస్థ సన్నద్ధతలోపంతోనే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ మూడు రోజుల వ్యవధిలోనే 2,507 విమానాలను రద్దు చేశారు. ఫలితంగా పలు విమానాశ్రయాల్లో 3 లక్షలకు మందికి పైగా ప్రయాణికులు పడిగాపులు కాస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 

ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఈఓగా పీటర్ ఎల్బెర్స్ విఫలమయ్యారని మీడియా కథనాలు ఆయనపై దుమ్మెత్తిపోశాయి. దాంతో ఆయన వీడియో మెసేజ్‌తో ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. డిజిసిఏ ఇండిగోపై రికార్డు స్థాయిలో రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. ఎల్బర్స్‌కు నేరుగా షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో 65 శాతానికి పైగా వాటా ఉంది.