ఇరాన్ భారీ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’

ఇరాన్ భారీ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’

* నీటిశుద్ధి ప్లాంట్లపై పరస్పరం దాడులు

ఇరాన్ వద్ద ఉన్న భారీ అణు నిల్వలను నియంత్రించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యూహాత్మకమైన, అత్యంత సాహసోపేతమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రస్తుతం సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను కలిగి ఉందని సమాచారం. 

ఈ నిల్వలను స్వాధీనం చేసుకోవడం ద్వారా, ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా అడ్డుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.  ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ తన అణు కేంద్రాలను సాధారణ ప్రదేశాల్లో కాకుండా, పర్వతాల లోపల వందల అడుగుల లోతులో నిర్మించింది. 

అత్యంత ఆధునిక బాంబులు సైతం ఛేదించలేని విధంగా ఈ బంకర్లను రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను, ప్రత్యేక దళాలను ఉపయోగించి అత్యంత రహస్యంగా ఈ మిషన్‌ను పూర్తి చేయాలని యోచిస్తోంది. అయితే, ఈ మాస్టర్ ప్లాన్ అమలులో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. 

ఒకవేళ ఈ మిషన్ విఫలమైతే, అది ఇరాన్, అమెరికా మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయడమే కాకుండా, మధ్యప్రాచ్యం మొత్తం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అణు భద్రతపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

మరోవంక, ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. తమ నీటిశుద్ధి ప్లాంట్‌పై దాడి చేశారని ఇరాన్‌ ఆరోపించగా, తమ ప్లాంట్‌పై ఇరాన్‌ దాడి చేసిందని బహ్రెయిన్‌ తెలిపింది.  యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్భలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. 
 
దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటిశుది ్ధప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తుంది.  పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటిశుద్ధి ప్లాంట్లను ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటిశుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ తదితర అరబ్‌ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి.