మూడోసారి టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం

మూడోసారి టీ20 ప్రపంచకప్ భారత్ కైవసం

టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. ఐసీసీ ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా మూడో టైటిల్‌ను అందుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది. తమకు అచ్చిరాదేమో అనుకున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ప్రత్యర్థిని 96 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫీని నిలబెట్టుకుంది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు ఇది వరుసగా రెండో వరల్డ్‌ కప్‌ (2024 తర్వాత) కాగా స్వదేశంలో ఈ ట్రోఫీ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది. ఫైనల్‌లో సంజూ శాంసన్‌ (46 బంతుల్లో 89, 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 52, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర మెరుపులతో భారత్‌  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల రికార్డు స్కోరు చేసింది. 

ఛేదనలో బుమ్రా (4/15) పేస్‌ పదునుకు తోడు అక్షర్‌ పటేల్‌ (3/27) స్పిన్‌ మాయతో కివీస్‌ 19 ఓవర్లలో 159కే కుప్పకూలింది. టిమ్‌ సీఫర్ట్‌ (26 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా నిరాశపరిచారు. బుమ్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, శాంసన్‌కు(321 పరుగులు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డులు దక్కాయి.

ఛేదనలో న్యూజిలాండ్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్‌ ఓటమి ఆ జట్టు ఇన్నింగ్స్‌ అర్ధభాగానికే ఖరారైంది. బుమ్రా, అక్షర్‌ దెబ్బకు బ్లాక్‌ క్యాప్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుదేలైంది. గత మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతకంతో సఫారీ బౌలింగ్‌ను చెడుగుడాడుకున్న విధ్వంసకర ఫిన్‌ అలెన్‌ (9) మూడో ఓవర్లోనే ఔట్‌ అవడంతో ఆ జట్టు ఢీలా పడింది.

ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (52, 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (43, 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. భారత పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (4/15), అక్షర్‌ పటేల్‌ (3/27) ఛేదన ఆరంభంలోనే న్యూజిలాండ్‌ నడ్డి విరిచారు. పవర్‌ప్లేలోనే భారత్‌ విజయాన్ని ఖరారు చేశారు. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్‌ కుప్పకూలింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన కెప్టెన్సీ మార్కుతో జట్టును ముందుండి నడిపించాడు. మ్యాచ్‌ ముగియగానే నరేంద్ర మోడీ స్టేడియం త్రివర్ణ పతాకాల రెపరెపలతో, బాణసంచా వెలుగులతో నిండిపోయింది. ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగంతో ఒకరినొకరు హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చడం ప్రతి భారతీయుడినీ కదిలించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి, ఒత్తిడిని అధిగమించి టైటిల్‌ను నిలబెట్టుకోవడం ద్వారా భారత్‌ తన ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. 

‘ఇండియా ఈజ్‌ ద కింగ్‌’, క్రికెట్‌ సామ్రాజ్యానికి మరోసారి రారాజుగా నిలిచింది. అభిమానుల కేరింతల మధ్య తన కిరీటాన్ని పదిలం చేసుకుంది. క్రికెట్‌ చరిత్రలో ఇదొక అద్భుతమైన సువర్ణాధ్యాయం!

ప్రధాని మోదీ ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. టోర్నమెంట్ అంతటా ఆటగాళ్ల ప్రదర్శన, దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన సందేశంలో, ఈ విజయం జట్టు అసాధారణ నైపుణ్యం, దృఢ సంకల్పం, బలమైన జట్టుకృషిని ప్రతిబింబించే అద్భుతమైన విజయం అని ప్రధాని కొనియాడారు.

పోటీ సమయంలో ఆటగాళ్ళు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించారని, టైటిల్‌ను దక్కించుకోవడానికి సవాలుతో కూడిన క్షణాలను విజయవంతంగా అధిగమించారని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రజలను గర్వం, ఆనందంతో నింపిందని, మొత్తం దేశం జట్టు విజయాన్ని జరుపుకుంటుందని మోదీ తెలిపారు.

టీమిండియా ఘన విజయం సాధించడంపై సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించారు. ఈ విజయంపై విరాట్‌ కోహ్లీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ”ఛాంపియన్స్‌! అహ్మదాబాద్‌లో టీమిండియాకు ఇది అద్భుత విజయం. టోర్నమెంట్‌ ఆసాంతం మనవాళ్ళు ఎక్స్‌ప్లోజివ్‌ క్రికెట్‌ ఆడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాడి మళ్లీ వరల్డ్‌ చాంపియన్లుగా నిలిచిన తీరు అద్భుతం” అని పేర్కొన్నాడు.

 ”టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన ఘనత భారత్‌కే దక్కుతుంది. కివీస్‌ బౌలర్లతో పోలిస్తే మన బౌలర్లు స్లోయర్‌, షార్ట్‌ పిచ్‌ బంతులను తెలివిగా విసిరారు. ఇక్కడి బౌండరీ కొలతలకు తగ్గట్టుగా లెంగ్త్స్‌ మార్చడం వల్లే విజయం సాధ్యమైంది” అని సచిన్‌ కొనియాడారు.