ఖమేనీ మృతికి భారీ మూల్యం చెల్లించక తప్పదు

ఖమేనీ మృతికి భారీ మూల్యం చెల్లించక తప్పదు

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చరించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టడం అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.

దాడుల్లో తమ నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది సాధారణ విషయం కాదని, దీనికి తగిన రీతిలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.  మా నాయకుడి రక్తం చిందించినందుకు, వెయ్యి మందికి పైగా మా పౌరులను బలితీసుకున్నందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్‌ను మేము వదిలిపెట్టం.. ఆయన మూల్యం చెల్లించాల్సిందే” అని లారిజానీ ఎక్స్ వేదికగా గర్జించారు. 

ఇరాన్ పొరుగు దేశాలకు కూడా ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికా తన స్థావరాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా వాడుకోకుండా అడ్డుకోవాలని, లేదంటే తామే నేరుగా రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు.  అదేవిధంగా ఈ యుద్ధంలో తాము అనేక మంది అమెరికన్‌ సైనికులను బంధించామని అలీ లారిజాని మరో పోస్టులో పేర్కొన్నారు. బంధీలను జైళ్లలో ఉంచినట్లు తెలిపారు.

ఇరాన్‌ దాడుల్లో కేవలం ఆరుగురు యూఎస్ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నిజానికి చాలామంది చనిపోయారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మృతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులపై లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయని తేల్చి చెప్పారు. 

అమెరికా తీరుపై లారిజానీ విమర్శలు చేస్తూ.. ఇరాన్‌ను ముక్కలు చేసేందుకు అమెరికా కుట్ర చేస్తోందని ఆరోపించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని యూఎస్‌ బలగాలు బంధీగా తీసుకెళ్లిన విషయాన్ని లారిజాని ప్రస్తావించారు. వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్‌లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని, కానీ అది విఫలమైందని గుర్తు చేశారు.  అయితే పశ్చిమాసియా పరిస్థితులను అమెరికా తప్పుగా అంచనా వేస్తోందని, ఇప్పటికే వారు మా ఉచ్చులో చిక్కుకున్నారని ఎద్దేవా చేశారు.

ఇరాన్ హెచ్చరికలను డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కొట్టిపారేశారు. “అసలు ఆ లారిజానీ ఎవరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు అనవసరం. ఇరాన్ ఇప్పటికే ఓడిపోయింది” అంటూ సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ వెంటనే షరతులు లేని లొంగుబాటు ప్రకటించాలని, లేదంటే అమెరికా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే లోపే తాము ముందుగా స్పందించామని ఆయన సమర్థించుకున్నారు.
కాగా,  యూఎస్‌ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమని సెంటాకామ్‌ ప్రతినిధి మీడియాతో అన్నారు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌..భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్‌దేశాలపై డ్రోన్లు, క్షిపణుల్తో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరం, ఇరాక్‌లోని అమెరికా ఎంబస్సీ, ఇరాక్‌లోని ఇర్బిల్‌ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌, తాజాగా మరికొన్ని మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. తాజా దాడుల్లో దుబాయ్‌లోని ప్రసిద్ధ 23 మెరినా టవర్‌ దెబ్బతింది.

మరోవైపు ఆరు నెలల పాటు తీవ్రమైన యుద్ధం చేయగలమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్​ తెలిపారు.  అమెరికా-ఇజ్రాయెల్​పై ఇరాన్ కనీసం ఆరు నెలల పాటు యుద్దం చేయగలదని ఆదివారం ఐఆర్​జీసీ ప్రతినిధి అలీ మహ్మద్ నైని ఓ వార్త సంస్థకు తెలిపారు. సాయుధ దళాలు ప్రస్తుతం ఉన్న సార్థ్యాలతో కనీసం ఆరు నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించలమని చెప్పారు. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులకు సంబంధించి 200 కంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపారు.