దేశవ్యాప్తంగా గృహ ఎల్పిజి సిలిండర్ల ధర పెంపు శనివారం నుండి అమల్లోకి రావడంతో గృహ బడ్జెట్లు వేడిగా మారనున్నాయి.ప్రామాణిక 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ.60 పెరిగింది.ఈ పెంపు వాణిజ్య ఎల్పిజి సిలిండర్లకు కూడా వర్తిస్తుంది. ఇవి రూ.115 పెరిగాయి.సవరించిన రేట్లు వెంటనే వర్తిస్తాయి. గృహ వినియోగదారులు, రోజువారీ కార్యకలాపాల కోసం ఎల్పిజిపై ఆధారపడే వ్యాపారాలు రెండింటినీ ప్రభావితం చేస్తాయి.
మరోవంక, తాజాగా వంట గ్యాస్ బుకింగ్స్ పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు గ్యాస్ కొరత వస్తుందనే నేపథ్యంలో గ్యాస్ బుకింగ్పై కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చాయి. డబుల్ సిలిండర్ ఉన్న వారికి డెలివరీ అయిన నెల రోజుల తర్వాత, అలాగే సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునేలా గడువు విధించారు.
తాజా సవరణతో, ఢిల్లీలో 14.2 కిలోల గృహ ఎల్పిజి సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913కి పెరిగింది. ముంబైలో, ధర రూ.852.50 నుండి రూ.912.50కి పెరిగింది. కోల్కతాలో అత్యధిక ధర సవరణలలో ఒకటి జరిగింది.సిలిండర్ ధర రూ.879 నుండి రూ.930కి పెరిగింది. ఇంతలో, చెన్నైలో, ధర రూ.868.50 నుండి రూ.928.50కి పెరిగింది. 2025 ఏప్రిల్లో ఢిల్లీలో సబ్సిడీ లేని ధరను రూ. 853గా నిర్ణయించిన తర్వాత దేశీయ ఎల్పిజి ధరల్లో తొలి సవరణ తాజా పెంపు.
వాణిజ్య ఎల్పిజి సిలిండర్లు కూడా ఖరీదైనవిగా మారడంతో వీటిపై ఎక్కువగా ఆధారపడే హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థల వంటి వ్యాపారాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 1,768.50 నుండి రూ. 1,883కి పెరిగింది.ముంబైలో, రేటు రూ. 1,720.50 నుండి రూ. 1,835కి పెరిగింది. అదేవిధంగా, కోల్కతాలో ధర రూ. 1,875.50 నుండి రూ. 1,990కి పెరిగింది. చెన్నైలో ధర రూ. 1,929 నుండి రూ. 2,043.50కి పెరిగింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు తలెత్తుతాయనే ఆందోళనల మధ్య దేశంలో ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను కేంద్రం ఆదేశించింది. దేశంలో కేవలం 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. గ్యాస్ తయారీకి వాడే ప్రొపేన్, బ్యూటేన్లను పెట్రో కెమికల్ రంగానికి మళ్లించకుండా వంటగ్యాస్ కోసమే వాడాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ చమురు శుద్ధి సంస్థలకు స్పష్టం చేసింది.
ఉత్పత్తి చేసిన గ్యాస్ను ప్రభుత్వరంగ సంస్థలైన ఐఒసి, బిపిసిఎల్, హెచ్పిసిఎల్లకు మాత్రమే విక్రయించాలని, తద్వారా దేశీయ వినియోగదారులకు నిరంతర సరఫరా జరిగేలా చూడాలని సూచించింది. భారత్ ఎల్పిజి అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఎల్పిజి గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 32 కోట్ల మంది ఎల్పిజి వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుందని ఇటీవల పలు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కోటి 30 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా 58 లక్షల నుంచి 60 లక్షల వరకు గృహ వినియోగ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. అంటే రోజుకు సగటున దాదాపు రెండు లక్షల సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్లు ప్రతి నెలా దాదాపు 7 లక్షలు సరఫరా అవుతున్నాయి.
ఇక పరిశ్రమల అవసరాల కోసం బల్క్ ఎల్పీజీ వినియోగం కూడా ప్రతి నెలా సుమారు 20 వేల నుంచి 22 వేల టన్నులు వినియోగిస్తున్నాయి. ఆటో రిక్షాలు, వాణిజ్య వాహనాలు ఉపయోగించే ఆటో ఎల్పీజీ వినియోగం కూడా నెలకు 9 వేల నుంచి 10 వేల టన్నుల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్ను అత్యంత పొదుపుగా వినియోగించాలని అధికారులు కోరుతున్నారు.
More Stories
10 లక్షల సైనికులతో అమెరికాను ఢీకొట్టేందుకు ఇరాన్ సన్నద్ధం
పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీ రాముడు
టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దాం!