ఇరాన్ అండ‌ర్‌గ్రౌండ్ మిస్సైల్ ఫ్యాక్ట‌రీపై దాడి

ఇరాన్ అండ‌ర్‌గ్రౌండ్ మిస్సైల్ ఫ్యాక్ట‌రీపై దాడి

* ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసాం.. ట్రంప్

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌తో పాటు ఇత‌ర మిలిట‌రీ కేంద్రాల‌పై గ‌త రాత్రి ఇజ్రాయెల్ దాడ‌లు చేసింది. అండ‌ర్‌గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యార్టీతో పాటు ఓ మిలిట‌రీ అకాడ‌మీపై దాడి చేసిన‌ట్లు ఐడీఎఫ్(ఐడిఎఫ్) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇజ్రాయెల్ వైమానిక ద‌ళానికి చెందిన 80 ఫైట‌ర్ విమానాలు ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి.  ఆ జెట్స్ సుమారు 230 బాంబుల‌ను జార‌విడిచిన‌ట్లు మిలిట‌రీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

బాలిస్టిక్ క్షిప‌ణుల‌కు చెందిన స్టోరేజ్‌, ప్రొడ‌క్ష‌న్ కేంద్రాన్ని టార్గెట్ చేశామ‌ని, ఇక్క‌డ నుంచి ఇరాన్ సైన్యానికి చెందిన వేలాది మంది సైనికులు ఆప‌రేట్ చేస్తుంటార‌ని ఐడీఎఫ్ చెప్పింది.  శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన దాడి ప్రాంతంలో బంకర్లు ఉన్నాయ‌ని, మిలిట‌రీ హెడ్‌క్వార్ట‌ర్స్ కూడా ఉన్న‌ట్లు ఐడీఎప్ పేర్కొన్న‌ది. ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డు కార్ప్స్‌కు చెందిన మిలిట‌రీ అకాడ‌మీ ఇమామ్ హుస్సేన్ యూనివ‌ర్సిటీపై కూడా దాడి చేసినట్లు ఐడీఎఫ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్ర‌యంపై కూడా శుక్ర‌వారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో విమానాలు ద‌గ్ధం అయ్యాయి. భారీ ఎత్తున ఆ విమానాశ్ర‌యం నుంచి న‌ల్ల పొగ‌లు క‌మ్ముకున్నాయి. ఇరాన్‌లో అత్యంతి బిజీ ఎయిర్‌పోర్టు అది. వైమానిక బాంబు దాడులు జ‌రిగిన స‌మ‌యంలో ఆ విమానాశ్ర‌యంలో చాలా వ‌ర‌కు విమానాలు పార్క్ చేసి ఉన్న‌ట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా తెలిసింది. 

ఎయిర్‌పోర్టులోని కొన్ని భాగాలు ధ్వంస‌మైన‌ట్లు ఇరాన్ మీడియా పేర్కొన్న‌ది. చాలా విస్తృత స్థాయిలో దాడులు చేయ‌నున్న‌ట్లు శుక్ర‌వారం ఇజ్రాయెల్ మిలిట‌రీ ప్ర‌క‌టించింది. మార్చి 4వ తేదీన కూడా ఇదే విమానాశ్ర‌యాన్ని టార్గెట్ చేశారు. ఆ దాడి వ‌ల్ల అక్క‌డ ఉన్న డిఫెన్స్‌, డిటెక్ష‌న్ సిస్ట‌మ్స్ ధ్వంస‌మైన‌ట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పేర్కొన్న‌ది. తాజా స‌మాచారం ప్ర‌కారం అమెరికా-ఇజ్రాయెల్ జ‌రిపిన దాడుల్లో ఇరాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1332 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ యుద్ధంలో భాగంగా వారం రోజుల్లో ఇరాన్ భూభాగంలోని 3,000 లక్ష్యాలపై తమ సైన్యం విరుచుకపడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ శనివారం ప్రకటించింది.  ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను కోల్పోయిందని, ఇరాన్ సైన్యం అంతమైపోయిందని,  వారి నౌకాదళం కనుమరుగైైందని, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. 
 
ఇరాన్‌లో ఇప్పటికే రెండు స్థాయిల నాయకత్వం అంతమైందని, ఇప్పుడు వారు మూడో స్థాయి నాయకత్వంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఇరాన్ వద్ద ఉన్న 32 నౌకలు ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని, అసలు ఆ దేశానికి నౌకాదళం అనేదే ఇప్పుడు లేదని, ఇక వైమానిక దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇరాన్​పై డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న సైనిక చర్యలకు అమెరికా కాంగ్రెస్​ నుంచి మద్దతు లభించింది. ఇరాన్​పై దాడులను నిలిపివేయాలని ట్రంప్​నకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానం ఏడు ఓట్ల తేడాలో వీగిపోయింది. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా 219 ఓట్లు రాగా, అనుకూలంగా 212 ఓట్లు వచ్చాయి. అయితే ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇద్దరు రిపబ్లికన్లు ఓటు వేశారు. అదే సమయంలో నలుగురు డెమొక్రట్లు అధ్యక్షుడి చర్యలను సమర్థించారు. రెండు రోజుల క్రితం సెనేట్​లో కూడా ఈ తీర్మానం ఆమోదం పొందలేదు.