అనిల్ అంబానీ `రిలయన్స్ పవర్’పై ఈడీ త‌నిఖీలు

అనిల్ అంబానీ `రిలయన్స్ పవర్’పై ఈడీ త‌నిఖీలు
వ్యాపార‌వేత్త అనిల్ అంబానీకి చెందిన రిలియ‌న్స్ ప‌వ‌ర్ కంపెనీతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు చేప‌ట్టింది. ముంబై, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. రెండు న‌గ‌రాల్లో ఉన్న ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇండ్ల‌పై సోదాలు జ‌రుగుతున్న ఈడీ పేర్కొన్న‌ది.  సుమారు ప‌ది నుంచి 12 లొకేష‌న్ల‌లో ఆ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు చెప్పింది. సుమారు 15 మంది సిబ్బంది సోదాల్లో పాల్గొన్న‌ట్లు ఈడీ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.
అనిల్ అంబానీకి చెందిన ప‌లు కంపెనీల‌పై  బ్యాంక్ ప్రాడ్‌, మ‌నీల్యాండ‌రింగ కేసుల్లో ఈడీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.  గ‌త నెల‌లో ముంబైలో ఉన్నసుమారు రూ 3,500 కోట్ల విలువైన అనిల్ అంబానీ ఇంటిని ఈడీ జప్తు చేసింది. రిలయన్స్‌ ఏడీఏజీ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ రిలయన్స్‌ పవర్‌తో పాటు దాని అనుబంధ సంస్థలపై శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.
 
ముంబయితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. రిలయన్స్‌ పవర్‌కు చెందిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. 
ఇప్పటికే అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల అనంతరం ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. 
ముఖ్యంగా అనిల్‌ అంబానీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు, రిలయన్స్‌ పవర్‌తో సంబంధం ఉన్న డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో అధికారుల రెయిడ్స్‌ కొనసాగుతున్నాయి.  గతంలో కూడా ‘పండోరా పేపర్స్‌’ లీక్‌, ఇతర ఆర్థిక లావాదేవీల కేసుల్లో అనిల్‌ అంబానీ ఈడీ ముందు హాజరై విచారణను ఎదుర్కొన్న సంగతి విదితమే.