అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భీకర దాడులు

అమెరికా, ఇజ్రాయెల్​ స్థావరాలపై భీకర దాడులు

* ఇరాన్ జలాంతర్గామిపై దాడిలో 100 మంది గల్లంతు .. ఇరాన్ జెట్ కూల్చివేత

రాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న రహస్య అణ్వస్త్ర హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. 2025 సంవత్సరంలో తాము చేసిన దాడుల్లో ధ్వంసమైన ఈ న్యూక్లియర్ ప్లాంటును ఇరాన్ మళ్లీ నిర్మించుకుందని తెలిపింది. టెహ్రాన్ నగర శివార్లలో ఉన్న ఈ అణ్వస్త్ర తయారీ ప్లాంటు పేరు మిన్జా దేహై అని చెప్పింది.

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ బాంబుల వ‌ర్షం కురిపించింది. ఇజ్రాయెల్ వైమానిక ద‌ళానికి చెందిన ఎఫ్‌-35ఐ యుద్ధ విమానం టెహ్రాన్ గ‌గ‌న‌త‌లంలో యాక్‌-130 జెట్‌ను కూల్చివేసింది. కొన్ని క్ష‌ణాల క్రితం ర‌ష్యా త‌యారీకి చెందిన యాక్‌-130 జెట్‌ను కూల్చిన‌ట్లు ఐడీఎఫ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఎఫ్‌-35 యుద్ధ విమానం ర‌ణ‌రంగంలో ఓ మాన‌వస‌హిత విమానాన్ని కూల్చ‌డం ఇదే మొద‌టిసారి. గడిచిన 40 ఏళ్ల‌లో తొలిసారి ఇజ్రాయెల్ వైమానిక ద‌ళాలు మాన‌వ‌స‌హిత ఎయిర్-టు ఎయిర్- కంబాట్‌లో పాల్గొన్నాయి.

శ్రీలంక తీరానికి సమీపంలో ఇరానియన్ నౌకపై జరిగిన జలాంతర్గామి దాడిలో 100 మందికి పైగా గల్లంతయ్యారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఘటనలో డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. శ్రీలంక నావికాదళం, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం మాట్లాడుతూ, దాడి తర్వాత కనీసం 101 మందిని లెక్కించలేమని చెప్పారు. అదనంగా, 78 మంది గాయపడినట్లు చెబుతున్నారు. శ్రీలంక తీరప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.  

హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తుందనిట్రంప్ చేసిన ప్రకటనను ఐఆర్​జీసీ కొట్టిపారేస్తూ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకు ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఈ జలసంధి నుంచి ఏమైనా నౌకలు ప్రయాణిస్తే ధ్వంసం చేస్తామని హెచ్చిరించింది.  హిందూ మహాసముద్రంలో ఒక అమెరికన్ యుద్ధనౌకపై దాడి జరిపినట్లు ఐఆర్​జీసీ తెలిపింది. 

దాడి సమయంలో ఒక అమెరికన్ ట్యాంకర్ నుంచి ఇంధనం నింపుకుంటోందని, ఈ దాడి కారణంగా రెండు నౌకలలోనూ మంటలు చెలరేగినట్లు తెలిపింది. ఆక్రమిత ప్రాంతాల్లోని అనేక సున్నిత, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేశామని, అలాగే ఖతార్, యూఏఈ, కువైట్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు నిర్వహించామని తెలిపింది.

కాగా, ఇరాన్​ నూతన సుప్రీం లీడర్​గా ఎవరు నియామకమైనా అతను కూడా తమ హిట్ లిస్ట్​లో ఉంటారని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కొత్త సుప్రీంగా ఎంపికయ్యే వ్యక్తి ఎవరైనా సరే అతన్ని కూడా అంతం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ఇరాన్​ నూతన సుప్రీం లీడర్​గా ఖమేనీ కుమారుడిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌ నియామకం జరిగిన్నట్లు వార్తలు రావంతో ఈ హెచ్చరిక చేశారు. 

అబుదాబి, దుబాయ్‌ల్లో అమెరికా కాన్సులేట్స్‌ మూత

మరోవంక, ఇరాన్ సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (ఐఆర్​జీసీ) బుధవారం దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై 17వ విడత దాడులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్ని ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ గా ఇరాన్ వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ ఇంధన జీవనాడి హర్మూజ్​పై కూడా కీలక ప్రకటన చేసింది.

గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్‌లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తున్నది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. బుధవారం తెల్లవారుజామున దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. దీంతో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌ను మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది.

కువైట్, ఖతార్, ఇరాక్​లోని అగ్రరాజ్యం స్థావరాలపై 230 డ్రోన్లతో దాడులు తెలిపింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా 40 క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. ఇక ఇరాన్ చేసిన దాడుల్లో గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడిలో 680 మందికి పైగా అమెరికన్ సైనికులు చనిపోయారని తమ నిఘా వర్గాలు తెలిపాయని ఐర్​జీసీ తెలిపింది. 

బహ్రెయిన్‌లోని ఒక కీలకమైన అమెరికా వైమానిక స్థావరం ఈ దాడుల్లో పూర్తిగా దెబ్బతిన్నదని, అక్కడి కమాండ్ సెంటర్లు ధ్వంసం కావడంతో ఆ బేస్ ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుందని ఇరాన్ స్పష్టం చేసింది. 

కాగా, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో భద్రతా పరంగా యూఏఈలో లెవల్‌ 3 హెచ్చరికను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసింది. ‘జోర్డాన్, ఒమన్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలో భద్రతను లెవల్ 3కి పెంచాం. అమెరికా పౌరులు ఆయా దేశాలకు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలి’ అని పేర్కొంది.

అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ట్రెహాన్​లోనే బుధవారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్​లోని మషాద్​ నగరంలోని ఇమాన్ ఖోమేనీ ప్రార్థనా స్థలంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు.