సెమీస్‌కు భారత్‌.. వర్చువల్‌ నాకౌట్‌లో విండీస్‌పై ఘనవిజయం

సెమీస్‌కు భారత్‌.. వర్చువల్‌ నాకౌట్‌లో విండీస్‌పై ఘనవిజయం
టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాట్‌తో అదరగొట్టింది. భారత క్రికెట్‌ మక్కాగా పిలుచుకునే ఈడెన్‌ గార్డెన్స్‌లో వర్చువల్‌ నాకౌట్‌గా సాగిన పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసి సెమీస్‌కు అర్హత సాధించింది. 
 
విండీస్‌ నిర్దేశించిన 196 పరుగుల భారీ ఛేదనలో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన కెరీర్‌లోనే అత్యంత విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి మెరుపులతో ఛేదనను సూర్య సేన..19.2 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. శాంసన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 
 
అంతకుముందు భారత ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ సమష్టిగా ఆడి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 రన్స్‌ చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40, 5 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37 నాటౌట్‌, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్‌ (32) రాణించారు. ఈ ఓటమితో విండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
 
ఛేదనలో అభిషేక్‌ (10) మరోసారి స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుని నిరాశపరచగా హోల్డర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన ఇషాన్‌ కిషన్‌ (10) సైతం అతడినే అనుసరించాడు. ఈ క్రమంలో సంజూ, కెప్టెన్‌ సూర్య (18) జట్టును ఆదుకున్నారు. అకీల్‌ రెండో ఓవర్లో ఫోర్‌, రెండు సిక్స్‌లతో పరుగుల వేట ఆరంభించిన శాంసన్‌ తన కెరీర్‌ ఊగిసలాటల నడుమ మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు.
 
అనవసర షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకునే అలవాటున్న అతడు ఈ మ్యాచ్‌లో అలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా ఇన్నింగ్స్‌ ఆసాంతరం బాధ్యతతో ఆడాడు. షెఫర్డ్‌ ఓవర్లో లాంగాన్‌ మీదుగా 6, 4 బాదిన అతడు.. బౌండరీతో 26 బంతుల్లోనే తన తొలి టీ20 వరల్డ్‌ కప్‌ అర్ధ శతకం నమోదుచేశాడు. 11వ ఓవర్లో బంతినందుకున్న జోసెఫ్‌ సూర్యను ఔట్‌ చేసి 58 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. 
 
10-12 ఓవర్ల మధ్య స్కోరు వేగం నెమ్మదించడంతో పాటు ఛేదించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతుండటంతో సంజూ, సూర్య స్థానంలో వచ్చిన తిలక్‌ గేర్‌ మార్చారు. జోసెఫ్‌ ఓవర్లో తిలక్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో తిలక్‌ డ్రింక్స్‌ విరామం తర్వాత హెట్‌మెయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అప్పటికే క్రీజులో పాతుకుపోయిన సంజూ.. హార్ధిక్‌ పాండ్య (17), శివమ్‌ దూబె (8*) అండతో జట్టును విజయతీరాలకు చేర్చారు. సూపర్‌-8 దశకు గ్రూప్‌-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్‌, గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరాయి.