తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి ముడుపు పత్రం పథకం”

తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి ముడుపు పత్రం పథకం”
 
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీ‌వారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని  టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌స్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుక‌లు వేస్తున్నారు. 

ఇందుకు బదులుగా భక్తులు తిరుమ‌ల‌లో ఏర్పాటు చేసే కౌంట‌ర్ల‌లో యుపిఐ ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు త‌గిన ముడుపు ప‌త్రాలు అంద‌జేస్తారు. వాటిని నేరుగా శ్రీ‌వారి హుండీలో వేయ‌వ‌చ్చు. త‌ద్వారా భ‌క్తులు న‌గ‌దు, నాణేలు తీసుకువ‌చ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొల‌గుతాయి. టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని చైర్మన్ బి ఆర్ నాయుడు వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ బోర్డు స‌బ్ క‌మిటీ సిఫార్సుల మేర‌కు టీటీడీ చరిత్రలో తొలిసారిగా టిటిడి విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన‌ విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకులు, వంట గదుల ఆధునీకరణ, ఇత‌ర మౌళిక స‌దుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు ఆమోదం.

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్నప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపారు. ఆలయాలు, ప్రాకారాలు, రాజ గోపురాలు త‌దిత‌ర‌ నిర్మాణాల‌కు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీ‌వాణి ట్ర‌స్టు మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదించారు.

ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్ర‌హం ఏర్పాటుకు డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయించి, అందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం తెలిపారు. కోయంబత్తూర్, గువహటి, బెలగావి, అదేవిధంగా పాట్నా వ‌ద్ద మోకామ‌ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల‌కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి కేటాయించిన భూమిని తీసుకునేందుకు నిర్ణయించారు.

వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే దాదాపు 70 వేల మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా రూ.50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. గత ఏడాది తలంబ్రాల ప్యాకెట్ కిట్‌ను అందించిన విషయం తెలిసిందే.

బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా రూ. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది భద్రత సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తారు.

తిరుమల, తిరుపతిలోని టీటీడీ గోశాలలు, పలమనేరులోని శ్రీవేంకటేశ్వర ఇంక్యూబేషన్ సెంటర్ లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.