అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార దాడులు

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతీకార దాడులు

* ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్‌పై సౌదీ యువరాజు వత్తిడి

సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. చుట్టుపక్కల దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. దాంతో పలు దేశాల్లో పేలుళ్ల మోతమోగింది. ఇరాన్‌ బలగాలు నిన్నటి నుంచి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడటం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
 
ఇజ్రాయెల్‌ తోపాటు తన పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడటంపై యుఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ రాన్‌కు హెచ్చరించారు. ఇరాన్ తన తర్కాన్ని వాడాలని, పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని హితవు చెప్పారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఒక తప్పుడు లెక్క అంటూ ఈ చర్య ఇరాన్‌ను క్లిష్టమైన సమయంలో ఒంటరిని చేసిందని చెప్పారు.

మొత్తం 27 అమెరికా బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ వెల్లడించింది. అందులో ఇజ్రాయెల్‌లోని టెల్‌ నోప్‌ ఎయిర్‌ బేస్‌, ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యా కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని రక్షణరంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్‌ టార్గెట్‌ చేసుకుంది.  ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7.30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దుబాయ్‌లో ఈ ఉదయం 8.15 గంటల సమయంలో మూడు భారీ పేలుళ్లు సంభవించాయి. 

ఇరాన్‌ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చివేశాయి. శకలాలు కూలడంతో దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే జబిల్‌ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్‌పీ షిప్‌పై నాలుగు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దీనిని ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌లో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది.

ఇరాన్‌ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్‌ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్‌లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్‌లోని ఇర్బిల్‌ ఎయిర్‌ పోర్టుపై కూడా దాడి జరిగింది. దాంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. బాగ్దాద్‌లోని గ్రీన్‌ జోన్‌ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.

కాగా, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ దేశమైన ఇరాన్‌ పై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బయటికి ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతూనే గత నెలలో ట్రంప్‌కు పదేపదే ప్రైవేట్‌ ఫోన్‌ కాల్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రచురించింది.