మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన క్రమంలోనే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు కూడా నక్సల్స్ను లొంగిపోవాలని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల చాలా మంది మావోయిస్ట్లు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు ఉన్నారు.
ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టులతో తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా వారితో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఇన్నేళ్లుగా అడవుల్లో గడిపి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. హింస సమాజంలోని ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామ్యం ద్వారానే నెరవేరుతాయన్న సీఎం మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. సంపూర్ణ భద్రత, గౌరవంగా జీవించేలా సదుపాయాలు కల్సిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఈ సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి కూడా హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభం కావడానికి ముందు మీడియాతో మాట్లాడిన దేవ్జీ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతిలకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలన బాగుందని ప్రశంసలు గుప్పించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కానీ 5 ఎకరాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పినట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో లొంగిపోయిన వారికి ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దేవ్జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని, ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం సరైన దారి కాదని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
మాజీ మావోయిస్ట్ నేతలతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏ పనైనా చేసుకోవచ్చని వెల్లడించారు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నక్సల్స్ లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
More Stories
సౌందరరాజన్ కు ఆర్ఎస్ఎస్, వి హెచ్ పి, బిజెపి అశ్రునివాళి
దేశ ఆర్థిక వ్యవస్థ 7-7.4 శాతం వృద్ధి రేటు
అగ్నివీర్లు, ఆర్మీ సిబ్బందికి రిటైరయ్యాక రైల్వేలో ఉద్యోగాలు