పెద్ద‌లు భూములు ఆక్ర‌మిస్తుంటే ప‌ట్టించుకోరా?

పెద్ద‌లు భూములు ఆక్ర‌మిస్తుంటే ప‌ట్టించుకోరా?

పెద్ద‌లు భూములు ఆక్ర‌మించుకున్నా ప‌ట్టించుకోకుండా పేద‌ల ఇళ్ల‌ను కూల‌గొడుతున్నార‌ని బిజెపి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణలో పెద్దలు వేల కోట్ల భూములు ఆక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూకటపల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే పట్టించుకోవడం లేదని, పేదల ఇళ్ళు మాత్రం కూలగొడుతున్నారని ఆయన విమ‌ర్శించారు.

మూసి ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయడం,కూల్చడాన్ని ఒప్పుకోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  మధు పార్క్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ప్రజల ఆవేదన ప్రభుత్వానికి అర్ధం కావడం లేదా? అని రాజేందర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా పేదలకు భూములు, ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇళ్లును కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఇల్లు ఇవ్వాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన భూముల్లో గాంధీ పార్క్ కట్టుకోవాలని రాజేందర్ సూచించారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ మందుల బకాయిలకు, డైట్ చార్జీలకు నిధులు లేవని చెప్పి రూ.5 వేల కోట్లు పెట్టీ గాంధీ పార్కు ఎలా కడతామంటున్నారని ఆయన నిల‌దీశారు. తెలంగాణ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ తెలుసుకోవాల‌ని బిజెపి యంపీ హితవు చెప్పారు. 

రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాల‌ని ఆయన సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌ని హెచ్చరించారు. తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామ‌ని తెలిపారు.