మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నాయకుడు, ‘జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ అధినేత నెమెసియో ఒసెగ్వెరా సెర్వాంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ మృతిచెందాడు. మెక్సికన్ సైన్యం జరిపిన భారీ ఆపరేషన్లో ఎల్ మెంచో హతం కావడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న ఎల్ మెంచోను పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది.
పశ్చిమ మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో ఉన్న తపల్ప అనే పట్టణంలో సైన్యం ఈ దాడులు నిర్వహించింది. ఇది సీజేఎన్జీ కార్టెల్కు కంచుకోట లాంటి ప్రాంతం. మెక్సికన్ ఆర్మీ, నేషనల్ గార్డ్, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అమెరికా నిఘా సంస్థల సహకారంతో ఎల్ మెంచో ఆచూకీని పసిగట్టి చుట్టుముట్టారు. సైన్యం జరిపిన భీకర కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్ మెంచోను హెలికాప్టర్లో మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు మెక్సికో రక్షణ శాఖ ధృవీకరించింది.
ఎల్ మెంచో మరణవార్త తెలియగానే జలిస్కో రాష్ట్రం అట్టుడికిపోయింది. అతని అనుచరులు పెద్దఎత్తున హింసకు దిగారు. గ్వాడలజారా, ప్యూర్టో వల్లార్టా వంటి నగరాల్లో వాహనాలను తగులబెట్టి రోడ్లను బ్లాక్ చేశారు.దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్యూర్టో వల్లార్టా విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. జలిస్కో గవర్నర్ రాష్ట్ర వ్యాప్తంగా ‘రెడ్ కోడ్’ ప్రకటించి, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
మాజీ పోలీసు అధికారి అయిన ఒసేగురా, శక్తివంతమైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్జీ) నాయకుడు. ఈ సంస్థ మెక్సికోలోని రెండవ నగరమైన గ్వాడలజారాకు నిలయంగా ఉన్న పశ్చిమ రాష్ట్రం నుండి అదే పేరుతో ఏర్పడింది. హింస కారణంగా, జాలిస్కో, తమౌలిపాస్, మిచోకాన్, గెర్రెరో, న్యూవో లియోన్లలోని భారతీయ పౌరులను తదుపరి నోటీసు వచ్చే వరకు ఇంటి లోపలే ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఈ ఆపరేషన్ సమయంలో, దళాలు కాల్పులు జరిపి ఆ ప్రదేశంలో నలుగురు వ్యక్తులను చంపాయి. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సాయుధ వాహనాలు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడి వైద్య చికిత్స పొందుతున్నారు. ఎల్ మెన్చో అరెస్టుకు దారితీసిన సమాచారం కోసం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 15 మిలియన్ల డాలర్ల వరకు రివార్డును ప్రకటించింది.
మెక్సికోలో అత్యంత శక్తివంతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నేర సంస్థలలో సీజేఎన్జీ ఒకటి. 2009లో జన్మించింది. ఫిబ్రవరిలో, ట్రంప్ పరిపాలన కార్టెల్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.
More Stories
ఆఫ్ఘన్ నివాస ప్రాంతాలపై పాక్ దాడులు .. ఖండించిన భారత్
ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసన
ఆసీస్పై తొలిసారి టీ20 సిరీస్ భారత మహిళల కైవసం