ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత పౌరులకు అక్కడి మన ఎంబసీ తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.
భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండమని సూచించింది. అలాగే తాజా పరిణామాల సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచించింది.
భారతీయులంతా పాస్పోర్ట్లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఎంబసీ వద్ద మీ పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలి’ అని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో తెలిపింది.
ఇరాన్-అమెరికా దేశాల మధ్య అణు చర్చలు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడికి వెనుకాడబోమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్లను పశ్చిమాసియాలో మోహరించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.
జనీవాలో గురువారం ఇరాన్, అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకే భారత్ అప్రమత్తమైంది. వాస్తవానికి భారత ప్రభుత్వం 2026 జనవరి 5న ఒక అడ్వైజరీ జారీ చేసింది. కాగా ఇప్పుడు ఆ అడ్వైజరీలోని అంశాలనే ఇరాన్లోని రాయబార కార్యాలయం మరోసారి పునరుద్ఘాటించింది.

More Stories
మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా నేత హతం
ఆఫ్ఘన్ నివాస ప్రాంతాలపై పాక్ దాడులు .. ఖండించిన భారత్
ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసన