కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు మధ్య ఉద్రిక్తత

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు మధ్య ఉద్రిక్తత

* నాపై ఏ ఒక్క అవినీతి బయటపడినా రాజీనామా చేస్తా .. బిజెపి ఎమ్మెల్యే 

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా చైర్‌పర్సన్‌ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ బిజెపి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్‌ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను ఇతరులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. 
 
దీంతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి షబ్బీర్‌అలీపై విరుచుకు పడుతూ  ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని రూ.కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలప, సారా అమ్ముకుని పైకి వచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. 
 
కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకొని రావాలని, తాను ఒక్కడినే వస్తానని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం 8.30 గంటలకే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.  ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని క్యాంప్‌ కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంపు కార్యాలయానికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. 
ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్‌ గిరెడ్డి మహేందర్‌రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.  దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మహేందర్‌రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు. 

పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హైదరాబాద్‌లోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్‌ నుంచి వస్తుండగా మేడ్చల్‌ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులను భిక్కనూర్‌ టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేసి నిజామాబాద్‌కు తరలించారు.

ఇలా ఉండగా, తనను అవినీతిలో కింగ్ అన్నారని, తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మా‌ట్‌లో రాజీనామా చేస్తానని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో షబ్బీర్ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్, జడ్పీటీసీ చేశామని అన్నారని, ఆయన కామారెడ్డికి చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇలా ఉండగా, ఎమ్యెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి గానీ, హింసకు కాదని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గం అంటూ మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తూ కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బిజెపి సహించదని హెచ్చరించారు.