సెమీకండక్టర్ల తయారీ యూపీకి గర్వకారణం

సెమీకండక్టర్ల తయారీ యూపీకి గర్వకారణం

సెమీ కండక్టర్ల తయారీ యూపీకి గర్వకారణమనిపేర్కొంటూ సెమీకండక్టర్‌ యూనిట్‌ యూపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జెవార్‌లో ఫాక్స్‌కాన్‌- హెచ్ సి ఎల్ చిప్‌ తయారీ యూనిట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తూ సెమీకండక్టర్ల తయారీకి అరుదైన ఖనిజాలు చాలా ముఖ్యమని, ఆ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాధికారత సాధించినప్పుడే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

 
“కొన్నేళ్లక్రితం దేశం మేకిన్‌ ఇండియా సంకల్పం తీసుకున్నప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ ఇప్పుడు మేకిన్‌ ఇండియా బలమైన బ్రాండ్‌గా అవతరిస్తోంది. గత 11ఏళ్లలో దేశంలో ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులు దాదాపు 6రెట్లు పెరిగాయి. ఎలక్ర్టానిక్స్‌ ఎగుమతులు కూడా 8 రెట్లు పెరిగాయి. అందులో మొబైల్స్‌ తయారీ 28 రెట్లు పెరిగింది. మన మొబైల్‌ ఎగుమతుల్లో వంద శాతం వృద్ధి నమోదైంది” అని ప్రధాని తెలిపారు

“గత 11 సంవత్సరాల్లో ప్రధానమంత్రి భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి పవర్‌హౌస్‌గా స్థాపించారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఒక నెలలో, ఈ ప్లాంట్ నుంచి దాదాపు 3.6 కోట్ల చిప్‌లు ఉత్పత్తి అవుతాయి. మీరు చూసే డిజిటల్ స్క్రీన్‌లు ఇప్పుడు జెవార్‌లో తయారు అవుతాయి” అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

మరోవైపు, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ జెవార్ యూపీకి మాత్రమే కాకుండా మొత్తం దేశానికి కూడా ఒక ఆభరణంగా ఎదుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి చిప్స్ దార్శనికతపై యుపీ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.

“ఈ రోజు మనం ఇండియా చిప్ కోసం పునాది వేస్తున్నాం. భారతదేశంలో నమ్మకమైన సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రపంచ సాంకేతిక రంగంలో భారతదేశ వృద్ధికి కలిసి పనిచేయడానికి, ఎదగడానికి మేం ఎదురుచూస్తున్నాం” అని ఫాక్స్‌కాన్‌లోని సెమీకండక్టర్ బిజినెస్ గ్రూప్ అధ్యక్షుడు బాబ్ చెన్ తెలిపేరు. అదేవిధంగా, జాయింట్ వెంచర్ సౌకర్యం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీరుస్తుందని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్‌పర్సన్ రోషిణి నాడర్ పేర్కొన్నారు.