ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ప్లాజాల్లో డిజిటల్ చెల్లింపులు

ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ప్లాజాల్లో డిజిటల్ చెల్లింపులు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులకు ముగింపు పలకాలని నేషనల్ హైవే ఆథారటి ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) యోచిస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా డిజిటల్ విధానంలోనే టోల్ వసూళ్లు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, జాతీయ రహదారుల ఫీ ప్లాజాల్లో టోల్ చెల్లింపులు కేవలం డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు. 

వాహనదారులు తప్పనిసరిగా ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయడం ద్వారా దేశవ్యాప్తంగా సంపూర్ణ డిజిటల్ టోల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. గత కొన్ని సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ గణనీయంగా పెరిగింది.  ప్రస్తుతం 98 శాతం పైగా వాహనాల్లో ఆర్ఎఫ్ఐడి ఆధారిత ఫాస్టాగ్ అమర్చి టోల్ చెల్లింపులు ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతున్నాయి.

దీంతో టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయ రవాణా సులభమైంది. అదనంగా, దేశవ్యాప్తంగా జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల వాహనదారులు తక్షణమే డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాలోకి ప్రవేశించిన వాహనాలు నగదు చెల్లింపులు చేస్తే సాధారణ రుసుముకి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.

యూపీఐ ద్వారా చెల్లిస్తే వాహన రకం ప్రకారం 1.25 రెట్లు ఫీజు వసూలు చేస్తారు. ఈ చర్యలన్నీ నగదు వినియోగాన్ని తగ్గించడానికే చేపట్టినవని అధికారులు తెలిపారు.  ప్లాజా స్థాయిలో జరిగిన సమీక్షల్లో నగదు లావాదేవీల కారణంగా రద్దీ, వేచి ఉండే సమయం పెరగడం, చెల్లింపులపై వివాదాలు తలెత్తుతున్నాయని గుర్తించారు. డిజిటల్ విధానానికి పూర్తిగా మారడం వల్ల రహదారి, ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరుస్తుంది. వాహనాల ప్రవాహం వేగవంతమవుతుంది. రద్దీ తగ్గుతుంది.

లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,150కు పైగా జాతీయ రహదారి, ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల్లో ఈ మార్పులు అమలయ్యే అవకాశం ఉంది. పూర్తిగా డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారి, ఆలస్యాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. 

మొత్తంగా, నగదు రహిత టోల్ విధానం ద్వారా దేశ రహదారి వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ కీలక నిర్ణయానికి ముందడుగు వేస్తోంది.  ఇక గతేడాది ఏడాదికి 200 ట్రిప్పులు ఫాస్టాగ్ పాస్ను కేంద్రం తీసుకొచ్చింది. కేవలం రూ.3వేల రూపాయిలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. 

కేవలం రూ.3వేలతో వార్షిక పాస్‌ను తీసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై నిశ్చింతగా, సాఫీగా ఏడాదంతా రాకపోకలు సాగించొచ్చు. ఈ పాస్లను గతేడాగి ఆగస్టు 15 నుంచి జారీ చేయడం ప్రారంభించింది. ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల జారీ కోసం త్వరలోనే రాజ్‌మార్గ్ యాత్రా యాప్‌(Rajmarg Yatra App)తో పాటు ఎన్‌హెచ్ఏఐ(NHAI), ఎంఆర్‌టీహెచ్(MoRTH) అధికారిక వెబ్‌సైట్లలో ప్రత్యేకమైన లింక్ ద్వారా ఫాస్టాగ్ వార్షిక పాస్‌ల యాక్టివేషన్, రెన్యూవల్ చేయించుకోవచ్చన్నారు.