చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన

చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన

ఏపీ  శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హిందువులు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫొటోలను పట్టుకుని చెప్పులు, బూట్లతో ర్యాలీ నిర్వహించి, ప్రదర్శించారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభకు రావటంపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.  గందరగోళం మధ్య ఛైర్మన్‌ సభను వాయిదా వేయగానే వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులను, స్వామి వారిని ఫొటోలను టేబుల్పై పడేసి వెళ్లిపోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది.

శాసనమండలిలోనూ, అసెంబ్లీ బయట వెంకటేశ్వరస్వామి ఫొటోతో వైఎస్సార్సీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని ప్రవర్తించిన తీరును కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. సభలోనే దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామికి సభలో జరిగిన అవమానంపై కూటమి సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీఎల్పీలో మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.

ప్లకార్డులా దేవుడి ఫొటో వాడి మహాపచారానికి పాల్పడిన తీరును ఎన్డీఎల్పీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించారు. దేవుడికి జరిగిన అవమానానికి కోపంతో హెడ్ ఫోన్ విసిరానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చెప్పు తీయాలనేంత కోపం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.   విషయాన్ని వదిలిపెట్టకూడదన్న బిజెపి నేత సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరాని నేరం అని మండిపడ్డారు.

సమావేశం నుంచి పార్టీ జాతీయ పెద్దలకు ఫోన్‌ చేసి సభలో జరిగిన పరిణామాలను వివరించారు. స్వామి వారికి జరిగిన అపచారాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  హిందు మతాన్ని అవమానించారని పేర్కొంటూ చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇలాంటి చర్యకు చైర్మన్ గా ఎలా అంగీకరిస్తారని నిలదీశారు.

వైఎస్సార్సీపీ చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. ఆ సభ్యులను పిలిచి మాట్లాడతానని ఛైర్మన్ తెలిపారు. లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. జగన్ డైరెక్షన్లో హిందువులపై జరుగుతున్న దాడికి ప్రజలే బుద్ది చెప్తారని మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్సీలు హెచ్చరించారు.  జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఈ మేర కార్యక్రమాల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.