పిల్లలను లైంగికంగా వేధించడంతోపాటు లైంగిక వీడియోలు రికార్డ్ చేసి విదేశీయులకు, డార్క్ వెబ్లో అమ్ముతూ అరెస్టైన భార్యాభర్తలకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్, అతడి భార్య దుర్గావతి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
చిత్రకూట్, బండాతోపాటు సమీప జిల్లాలకు చెందిన ఐదు నుంచి 16 ఏళ్ల పిల్లలను మభ్యపెట్టి ఆకట్టుకున్నారు. వారితో లైంగిక చర్యలను వీడియో రికార్డ్ చేశారు. విదేశీయులతో పాటు డార్క్ వెబ్లో ఆ వీడియోలు అమ్మారు. లక్షల్లో డబ్బు సంపాదించారు. కాగా, కలకలం రేపిన ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది. రామ్ భవన్ ఇంట్లో సోదాలు చేసింది. రూ.8 లక్షల నగదు, 12 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, ఒక హార్డ్ డిస్క్, ఆరు పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకుంది.
ఆ పరికరాల్లో పెద్ద సంఖ్యలో పిల్లల లైంగిక వేధింపు వీడియోలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్లు, డార్క్నెట్ ఛానెల్ల ద్వారా విదేశీయులకు చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు 2020 అక్టోబర్లో రామ్ భవన్, అతడి భార్య దుర్గావతిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
పోక్సో చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. బండాలోని పోక్సో కోర్టు ఆరేళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపింది. చివరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. భార్యాభర్తలైన రామ్ భవన్, దుర్గావతిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది.

More Stories
ఉగ్రవాద ఆరోపణలపై ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
ఒడిశాలో 11 మంది, ఛత్తీస్గఢ్లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు