ప్రపంచంలోని టాప్-3 ఏఐ సూపర్ పవర్స్లో భారత్ ఒకటిగా ఉండాలని,వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఇదేనని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఓ ప్రముఖ వార్తా సంస్థ ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఏఎన్ఐ ప్రతినిధి : గ్లోబల్ సౌత్లో తొలిసారిగా భారత్ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ కి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమ్మిట్ నినాదం “అందరి సంక్షేమం, అందరి ఆనందం”. ఈ సమ్మిట్ దృక్పథం ఏంటి, ఈ నినాదాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
మోదీ : ప్రస్తుతం ఏఐ, నాగరికత పరంగా ఒక కీలక మలుపులో నిలిచి ఉంది. ఇది మానవ సామర్థ్యాన్ని ఊహించని విధంగా విస్తరించగలదు. కానీ సరైన మార్గనిర్దేశం లేకపోతే ప్రస్తుతం ఉన్న సామాజిక పునాదులను దెబ్బతీయగలదు. అందుకే మేము ఈ సమ్మిట్ను కేవలం ఆవిష్కరణల చుట్టూ కాకుండా, అర్థవంతమైన, సమానమైన ఫలితాలను అందించే ‘ప్రభావం’ చుట్టూ ఉద్దేశపూర్వకంగా రూపొందించాం.
దీని మార్గదర్శక స్ఫూర్తి, “సర్వజన్ హితాయ్, సర్వజన్ సుఖాయ్”, దేశ నాగరికత తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సాంకేతికత అంతిమ లక్ష్యం ‘అందరి సంక్షేమం, అందరి ఆనందం’ అయి ఉండాలి. సాంకేతికత మానవాళికి సేవ చేయడానికి ఉనికిలో ఉంది, వారిని భర్తీ చేయడానికి కాదు. ఈ సమ్మిట్ ప్రజలు, ప్లానెట్, పురోగతి అనే అంశాల చుట్టూ రూపొందించారు.
ఏఐ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల నుంచి ఉత్పత్తి అయిన జ్ఞానం, డేటాపై ఆధారపడతాయి. కాబట్టి, ఏఐ ప్రయోజనాలు అందరికీ అందాలి. ముందుగా స్వీకరించిన వారి వద్దే నిలిచిపోకూడదు. గ్లోబల్ సౌత్లో జరుగుతున్న మొట్టమొదటి గ్లోబల్ ఏఐ సమ్మిట్గా, అణగారిన వర్గాల గొంతుకలను, అభివృద్ధి ప్రాధాన్యతలను వినిపించే వేదికను భారత్ సృష్టిస్తోంది.
ఏఐ గవర్నెన్స్, సమ్మిళిత డేటాసెట్లు, వాతావరణ అనువర్తనాలు, వ్యవసాయ ఉత్పాదకత, ప్రజారోగ్యం, బహుభాషా ప్రాప్యత వంటివి మాకు అప్రధానమైన అంశాలు కావు. అవి మాకు కేంద్ర బిందువులు. మా విజన్ స్పష్టంగా ఉంది. ఏఐ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేయాలి, అదే సమయంలో అది పూర్తిగా మానవ-కేంద్రీకృతంగా ఉండాలి.
ఏఎన్ఐ ప్రతినిధి : సాధికారత, అభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగించడం గురించి మీరు ఎప్పుడూ చెబుతుంటారు. ‘వికసిత్ భారత్ 2047’లో ఏఐ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు?
మోదీ : వికసిత్ భారత్ 2047 దిశగా సాగుతున్న భారత ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుంది. ఏఐని వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా లోతైన అభివృద్ధి సవాళ్లను పరిష్కరించవచ్చు. అదే సమయంలో పూర్తిగా కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించవచ్చు, సమ్మిళిత వృద్ధిని సాధించవచ్చు. పట్టణ-గ్రామీణ అంతరాన్ని తగ్గించవచ్చు. అవకాశాలను విస్తృతం చేయవచ్చు.
ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఇప్పటికే ప్రభావాన్ని చూపుతోంది. ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో క్షయ, డయాబెటిక్ రెటినోపతి, మూర్ఛ సహా అనేక ఇతర వ్యాధులను ముందుగా గుర్తించడంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు పనిచేస్తున్నాయి. విద్యా రంగంలో, భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాట్ఫాంలు, గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారికి తగిన విద్యా సహకారాన్ని అందిస్తున్నాయి.
వేలాది గ్రామాల్లోని 36 లక్షల మంది మహిళా పాడి రైతులను చేరుకోవడానికి అమూల్ ఏఐని ఉపయోగిస్తోంది. పశువుల ఆరోగ్యం, ఉత్పాదకతపై గుజరాతీలో నిజ-సమయ మార్గదర్శకత్వాన్ని అందిస్తూ, క్షేత్రస్థాయి మహిళా ఉత్పత్తిదారులకు సాధికారత కల్పిస్తోంది. వ్యవసాయంలో, పంటల సలహాలు, నేల విశ్లేషణ, వాతావరణ సమాచారంలో ఏఐని ఏకీకృతం చేయడానికి ‘భారత్ విస్తార్’ చొరవ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైతులు మెరుగైన, స్థానిక పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
వారసత్వ పరిరక్షణలో కూడా పురాతన రాతప్రతులను డిజిటలైజ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతోంది. తద్వారా భారతదేశ నాగరికత జ్ఞాన వ్యవస్థలను వెలికితీస్తోంది. ఏఐ అగాధాలను పెంచుతుందని ప్రపంచం ఆందోళన చెందుతున్న వేళ, ఆ అగాధాలను తొలగించడానికి భారత్ దీనిని ఉపయోగిస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి పౌరుడికి ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాలను అందించడానికి మేము దీనిని సమర్థ సాధనంగా మారుస్తున్నాం.
ఏఎన్ఐ ప్రతినిధి : పారిస్లో జరిగిన ‘ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 సందర్భంగా మీ ప్రసంగంలో మీరు ఏఐలోని పక్షపాతం, పరిమితుల గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితి మారిందా? ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు?
మోదీ : ఏఐలోని పక్షపాతం, పరిమితులకు సంబంధించిన ఆందోళనలు ఇప్పటికీ లోతుగా ఉన్నాయి. ఏఐ వాడకం పెరిగేకొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ఏఐ వ్యవస్థలు లింగం, భాష, సామాజిక-ఆర్థిక నేపథ్యానికి సంబంధించిన పక్షపాతాలను అనుకోకుండానే కొనసాగించవచ్చు. ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వివిధ భాగస్వాములను ఒకచోట చేర్చుతుంది.
ఏఐ పక్షపాతాలు, పరిమితులు వంటి విషయాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తోంది. దీనికి ప్రపంచ సహకారం అవసరం. భారతదేశం విషయానికి వస్తే, మేము ప్రత్యేకమైన సవాళ్లను, అవకాశాలను ఎదుర్కొంటున్నాము. మన వైవిధ్యం – భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ పరంగా, పాశ్చాత్య సందర్భాల్లో స్పష్టంగా కనిపించని విధంగా ఇక్కడ ఏఐ పక్షపాతం బయటపడవచ్చు.
ప్రధానంగా ఇంగ్లీష్ డేటా లేదా పట్టణ సందర్భాలపై శిక్షణ పొందిన ఏఐ వ్యవస్థ, గ్రామీణ వినియోగదారులు లేదా ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి సరిగ్గా పనిచేయకపోవచ్చు. సానుకూల పరిణామం ఏమిటంటే, భారత్ దీనిని మరింత క్రమబద్ధంగా పరిష్కరించడం ప్రారంభించింది.దేశ బహుళత్వాన్ని సూచించే విభిన్న డేటాసెట్లను సృష్టించడం, ప్రాంతీయ భాషల్లో ఏఐ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం, భారతీయ విద్యా సంస్థలు, టెక్ కంపెనీలలో నిష్పక్షపాతం, బయాస్పై పరిశోధనలు పెరగడం మనం చూస్తున్నాము.
ఏఎన్ఐ ప్రతినిధి : ఆధార్, యూపీఐ వంటి తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించడంలో భారతదేశ విజయం అద్భుతమైనది. డీపీఐ, ఏఐ కలయిక ప్రజా సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గ్లోబల్ సౌత్కు సహాయపడేలా దీనిపై భారతదేశం నేర్చుకున్న పాఠాలు ఏమిటి?
మోదీ : భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణం గ్లోబల్ సౌత్కు కీలకమైన,ఆచరణాత్మక పాఠాలను అందిస్తుంది. డీపీఐ, ఏఐ కలయిక సమ్మిళిత అభివృద్ధిలో తదుపరి దశ. ఆధార్, యూపీఐ, ఇతర డిజిటల్ ప్రజా వస్తువులతో మా విజయం యాదృచ్ఛికం కాదు. ఇది పునరావృతం చేయగల కొన్ని సూత్రాల నుంచి వచ్చింది.
మొదట మేము డిజిటల్ మౌలిక సదుపాయాలను ‘ప్రజాక్షేమం ఆధారంగా నిర్మించాము, ప్రైవేట్ ప్లాట్ఫాంగా కాదు. ఒకదానితో ఒకటి పనిచేయగల ఆర్కిటెక్చర్, ఒక సాధారణ బేస్ లేయర్పై ఆవిష్కరణలు వర్ధిల్లడానికి అనుమతించింది. రెండోది మేము మొదటి రోజు నుంచే భారీ స్థాయిలో అందరినీ కలుపుకుపోయేలా దీనిని రూపొందించాము.
మన వ్యవస్థలు 140 కోట్ల మంది ప్రజలకు, వారి సామాజిక-ఆర్థిక స్థితి, అక్షరాస్యత స్థాయి, ప్రాంతం లేదా భాషతో సంబంధం లేకుండా పని చేస్తాయి. ఈ పునాదిపై ఏఐని జోడించినప్పుడు, పరిపాలన మరింత వేగంగా, సమర్థంగా మారుతుంది. ఏఐ సంక్షేమ పథకాల లక్ష్యాలను మెరుగుపరచగలదు. మోసాలను గుర్తించడాన్ని బలపరచగలదు. మౌలిక సదుపాయాల నిర్వహణను ముందుగానే పసిగట్టగలదు. పట్టణ ప్రణాళికకు మద్దతు ఇస్తుంది. ప్రభుత్వ వ్యవస్థలలో పారదర్శకతను పెంచుతుంది.
అదే సమయంలో పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, బలమైన డేటా గోప్యతా రక్షణలు, ఆలోచనాత్మకమైన నియంత్రణ చట్రాలు, సమాజంలో ఏఐ అక్షరాస్యత ప్రాముఖ్యాన్ని మేము అర్థం చేసుకున్నాము. మానవ-కేంద్రీకృత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించిన అనుభవంతో, ఏఐ ప్రయోజనాలు చివరి మైలు వరకు – గ్రామాల్లోని రైతులకు, చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు, ఎంఎస్ఎంఈలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు, అసంఘటిత కార్మికులకు, గ్రామీణ, పట్టణ భారతంలోని యువతకు చేరేలా చూడటంలో భారత్ అత్యుత్తమ స్థానంలో ఉంది.
ఇది కేవలం పట్టణ ఎలైట్ వర్గానికి మాత్రమే పరిమితం కాకూడదు. సాంకేతికత భౌగోళికం, లింగం లేదా ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి సేవ చేయాలి. మా లక్ష్యం కేవలం ఏఐని స్వీకరించడం కాదు. పౌరులకు నిజంగా సాధికారత కల్పించే, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేసే ఏఐ కావాలి. అలాగే గ్లోబల్ సౌత్కు స్కేల్ చేయగల నమూనాను అందించాలి.
ఏఎన్ఐ ప్రతినిధి : ఇంజనీరింగ్ ప్రతిభకు భారతదేశం ఒక శక్తి కేంద్రం. మనం ప్రపంచానికి పెద్ద ఎత్తున సాంకేతిక మానవ వనరులను అందిస్తున్నాము. ఏఐ యుగంలో దీన్ని మనం ఇంకా ఎలా లోతుగా విస్తరించవచ్చు?
మోదీ : ఏఐ వినియోగదారుడిగానే కాకుండా, సృష్టికర్తగా కూడా ఏఐ పవర్హౌస్గా మారడానికి భారతదేశానికి కావలసిన ప్రతిభ, వ్యవస్థాపక శక్తి ఉంది. మన స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, టెక్ ఎకోసిస్టమ్ తయారీ రంగాన్ని మెరుగుపరిచే, పాలనను మెరుగుపరిచే, కొత్త ఉద్యోగాలను సృష్టించే ఏఐ పరిష్కారాలను రూపొందించగలవు.
మన యువత భారతీయ వాస్తవాలకు అనుగుణంగా, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలు, క్షేత్రస్థాయి ఆవిష్కర్తల కోసం రూపొందించిన ఏఐ పరిష్కారాలను నిర్మించగలరని నాకు నమ్మకం ఉంది. ఏఐని ఆవిష్కరణ, సమ్మిళితత్వానికి గుణకంగా మార్చడానికి మన ప్రతిభావంతులైన యువత చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.
కేంద్ర బడ్జెట్ 2026-27 ఈ విజన్ను బలపరుస్తుంది. ఇది డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మద్దతును విస్తరిస్తుంది, దేశీయ కంప్యూట్ సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ఇండియా ఏఐ ఫ్రేమ్వర్క్ కింద, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలకు హై-పర్ఫార్మెన్స్ ఏఐ కంప్యూట్ వనరులను అందుబాటులోకి తెస్తున్నాము. సెమీకండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్స్ పిఎల్ఐ, ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, డిజిటల్ స్కిల్లింగ్పై నిరంతర ఒత్తిడి హార్డ్వేర్, మానవ వనరుల పునాదులను బలపరుస్తుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, మేము కేవలం ప్రతిభను పెంచడమే కాదు, ఏఐ విప్లవంలో పాల్గొనడం నుంచి దానిని తీర్చిదిద్దే స్థాయికి భారతదేశం ఎదగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పాలసీ ఎకోసిస్టమ్, నైపుణ్యాలను నిర్మిస్తున్నాము.
ఏఎన్ఐ ప్రతినిధి : భారతదేశ సేవల ఎగుమతులకు ఐటీ రంగం గణనీయంగా దోహదపడుతోంది. ఐటీ రంగంపై ఏఐ ప్రభావాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మన ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
మోదీ : భారతదేశ ఐటీ రంగం మన సేవల ఎగుమతులకు వెన్నెముకగా ఉంది. ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉంది. ఈ రంగానికి ఏఐ ఒక అద్భుతమైన అవకాశం, సవాలు కూడా. ఏఐ మార్కెట్ అంచనాల ప్రకారం, ఏఐ-ఎనేబుల్డ్ అవుట్సోర్సింగ్, డొమైన్-స్పెసిఫిక్ ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారతదేశ ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు.
ప్రాథమిక మార్పు ఏమిటంటే, ఏఐ ఐటీ రంగాన్ని భర్తీ చేయడం లేదు. అది దానిని రూపాంతరం చేస్తోంది. సాధారణ వినియోగ ఏఐ టూల్స్ విస్తృతంగా మారుతున్నప్పటికీ, ఎంటర్ప్రైజ్-స్థాయి ఏఐ వినియోగం ఇప్పటికీ నిర్దిష్ట రంగాల్లోనే కేంద్రీకృతమై ఉంది, సంక్లిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో ఐటీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి.
బలమైన భారతీయ ఏఐ ఎకోసిస్టమ్ను బలపర్చడానికి, ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కేంద్రంగా సమగ్ర వ్యూహంతో స్పందించింది. మేము ఇప్పటికే మా ప్రాథమిక జీపీయూల లక్ష్యాన్ని అధిగమించాము. స్టార్టప్లు, ఎంటర్ప్రైజెస్లకు ప్రపంచ స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటు ధరలో అందించడానికి కట్టుబడి ఉన్నాము.
మేము ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సుస్థిర నగరాలలో నాలుగు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు, మన మానవ వనరులకు.. పరిశ్రమకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను అందించడానికి.. ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ను ఏర్పాటు చేశాము. మన ఐటీ రంగం సేవలు అందించడంలోనే కాకుండా, భారతదేశానికి, ప్రపంచానికి పనికొచ్చే ఏఐ ఉత్పత్తులు, ప్లాట్ఫాంలు, పరిష్కారాలను నిర్మించడంలో కూడా నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాము.
ఏఎన్ఐ ప్రతినిధి : ఏఐ దుర్వినియోగం అవుతున్న అనేక ఉదాహరణలను మనం చూశాము. ఏఐ సాంకేతికత వల్ల కలిగే హాని నుంచి భారతీయుల భద్రతను మనం ఎలా నిర్ధారిస్తున్నాము?
మోదీ : సాంకేతికత ఒక శక్తిమంతమైన సాధనం, కానీ అది మానవ ఉద్దేశాన్ని పెంచే సాధనం మాత్రమే. అది మంచికే ఉపయోగపడేలా చూసుకోవడం మన బాధ్యత. ఏఐ మానవ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు, కానీ నిర్ణయాలు తీసుకునే అంతిమ బాధ్యత ఎప్పుడూ మనుషులదే అయి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజాలు ఏఐని ఎలా ఉపయోగించాలి, పాలించాలి అనే దానిపై చర్చిస్తున్నాయి.
బలమైన రక్షణలు, నిరంతర ఆవిష్కరణలు కలిసి సాధ్యమేనని చూపడం ద్వారా భారతదేశం ఈ చర్చను లేవనెత్తడంలో సహాయపడుతోంది. దీని కోసం మనకు కొన్ని ప్రాథమిక సూత్రాలపై నిర్మించిన ఏఐపై ప్రపంచ ఒప్పందం అవసరం. ఇందులో సమర్థ మానవ పర్యవేక్షణ, డిజైన్ దశలోనే భద్రత, పారదర్శకత, డీప్ఫేక్లు, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఏఐని ఉపయోగించడంపై కఠినమైన నిషేధాలు ఉండాలి.
ఏఐ నియంత్రణలో భారతదేశం మరింత నిర్మాణాత్మక పాలనా విధానం వైపు పయనిస్తోంది. 2025 జనవరిలో సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ప్రారంభంతో ఏఐ వ్యవస్థల నైతిక, సురక్షితమైన, బాధ్యతాయుతమైన విస్తరణను ప్రోత్సహించడానికి దేశం ఒక ప్రత్యేక యంత్రాంగం సృష్టించింది. ఏఐ మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మన బాధ్యత భావం మరింత బలపడాలి.
భారతదేశ విధానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే, స్థానిక ప్రమాదాలు, సామాజిక వాస్తవాలపై దాని దృష్టి ఉండాలి. అభివృద్ధి చెందుతున్న రిస్క్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ జాతీయ భద్రతా ఆందోళనలతో పాటు, మహిళలను లక్ష్యంగా చేసుకున్న డీప్ఫేక్లు, పిల్లల భద్రతా ప్రమాదాలు, వృద్ధులను ప్రభావితం చేసే బెదిరింపులు వంటి దుర్బల వర్గాలకు హానిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
డీప్ఫేక్ వీడియోల పెరుగుదల కారణంగా ఈ రక్షణల ఆవశ్యకత అందరికీ స్పష్టమవుతోంది. దీనికి ప్రతిస్పందనగా.. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కు వాటర్ మార్కింగ్, హానికరమైన సింథటిక్ మీడియాను తొలగించడం తప్పనిసరి చేస్తూ నిబంధనలను భారత్ నోటిఫై చేసింది. కంటెంట్ రక్షణలతో పాటు, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ డిజిటల్ ఎకోసిస్టమ్లో డేటా రక్షణ, వినియోగదారు హక్కులను బలపరుస్తుంది. భారతదేశ నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించింది.
సరిహద్దులకతీతంగా భద్రత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి విమానయానం, షిప్పింగ్లో ప్రపంచ నిబంధనలు ఉన్నట్లే, ఏఐలో కూడా ఉమ్మడి సూత్రాలు, ప్రమాణాల కోసం ప్రపంచం పనిచేయాలి. 2023 జీపీఏఐ డిక్లరేషన్, పారిస్ ఏఐ చర్చలు లేదా ప్రస్తుత సమ్మిట్ ద్వారా అయినా, సురక్షితమైన, సమ్మిళిత(ఏఐ ఫర్ ఆల్) కోసం రక్షణలను నిర్మిస్తూనే ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే సమతుల్య మార్గాన్ని భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తూ వస్తోంది.
ఏఎన్ఐ ప్రతినిధి : ఏఐ తమ ఉద్యోగాలను లాక్కుంటుందనే భయం యువతలో ఉంది. అదే జరిగితే భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని వినియోగించుకోవడం కష్టం. భారత ప్రభుత్వం ఈ సవాలును ఎలా ఎదుర్కొంటోంది?
మోదీ : ఏఐ కారణంగా ఉద్యోగ మార్కెట్లో వచ్చే అంతరాయాల గురించి మన యువత ఆందోళనను నేను అర్థం చేసుకోగలను. భయానికి సరైన విరుగుడు ‘సిద్ధం కావడం’. అందుకే ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మా ప్రజలకు స్కిల్లింగ్-రీ స్కిల్లింగ్పై మేము పెట్టుబడి పెడుతున్నాము. ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కిల్లింగ్ కార్యక్రమాలలో ఒకదానిని ప్రారంభించింది.
మేము దీనిని భవిష్యత్తు సమస్యగా చూడటం లేదు, ప్రస్తుత అత్యవసర విషయంగా పరిగణిస్తున్నాము. నేను ఏఐని మన సామర్థ్యాలను పెంచే సాధనంగా చూస్తాను, ఇది సాధ్యమని మనం అనుకున్న పరిమితులను దాటడానికి సహాయపడుతుంది. ఇది వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు సహా పెద్దసంఖ్యలో ప్రజలకు చేరువ కావడానికి, సహాయపడటానికి దోహదపడుతుంది.
సాంకేతికత కారణంగా పని కనుమరుగైపోదని చరిత్ర చూపింది. దాని స్వభావం మారుతుంది. కొత్త రకాల ఉద్యోగ సృష్టి జరుగుతుంది. కొన్ని ఉద్యోగాలు పునర్నిర్వచించవచ్చు, కానీ డిజిటల్ పరివర్తన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త టెక్ ఉద్యోగాలను కూడా జోడిస్తుంది. శతాబ్దాలుగా, ఆవిష్కరణలు, సాంకేతిక విప్లవాలు ఉద్యోగాలను తొలగిస్తాయనే భయాలు ఉన్నాయి.
అయినప్పటికీ, ఆవిష్కరణ జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని చరిత్ర మనకు బోధిస్తుంది. ఏఐ యుగంలో కూడా అదే జరుగుతుంది. ఈ మార్పుకు అనుగుణంగా మారడానికి భారతదేశం ఇప్పటికే బాగా సన్నద్ధమైంది. స్టాన్ఫోర్డ్ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ 2025లో, భారత్ 3వ స్థానంలో నిలిచింది.
ఇది ఏఐ పరిశోధన, అభివృద్ధి, ప్రతిభ, ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధిని సూచిస్తుంది. ఆవిష్కరణను సమ్మిళితత్వంతో జతచేస్తూ, ఏఐ భారతదేశ వర్క్ఫోర్స్ను బలపరుస్తుందని మేము నమ్ముతున్నాము. సరైన నైపుణ్యాలు, సన్నద్ధతతో, మన యువత భవిష్యత్తును నడిపిస్తారు.
ఏఎన్ఐ ప్రతినిధి : మీ నాయకత్వంలో, భారతదేశం 4జీ, 5జీ వంటి స్వదేశీ సాంకేతికతలను, అలాగే డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ఏఐపై మీ విజన్ ఏమిటి? అని ఏఎన్ఐ ప్రతినిధి ప్రశ్నించారు.
మోదీ : ఆత్మనిర్భర్ భారత్ వైపు మా ప్రయాణం ఒక ప్రాథమిక సూత్రంపై నిర్మితమైంది. భారతదేశం సాంకేతికతను కేవలం వినియోగించకూడదు, దానిని సృష్టించాలి. ఆత్మనిర్భర్ భారత్లో ఏఐ కోసం నా విజన్ మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. అవి సార్వభౌమాధికారం, సమ్మిళితత్వం, ఆవిష్కరణ.
నా విజన్ ఏమిటంటే, ఏఐ వినియోగంలోనే కాకుండా, సృష్టిలో కూడా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా టాప్ మూడు ఏఐ అగ్రరాజ్యాలలో ఒకటిగా ఉండాలి. మన ఏఐ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా మోహరించాలి. కోట్లాది మందికి వారి మాతృభాషలలో సేవలు అందించాలి. మన ఏఐ స్టార్టప్లు వందల బిలియన్ల విలువను కలిగి ఉండాలి, మిలియన్ల కొద్దీ అధిక నాణ్యత గల ఉద్యోగాలను సృష్టించాలి.
మన ఏఐ ఆధారిత ప్రజా సేవలు సమర్థమైన, సమానమైన పాలనకు బెంచ్మార్క్లుగా ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా, ప్రతి భారతీయుడు ఏఐని అవకాశాలను కల్పించేదిగా, సామర్థ్యాన్ని రెట్టింపు చేసేదిగా, మానవ గౌరవానికి సేవకుడిగా అనుభవించాలి, వారి జీవనోపాధికి ముప్పుగా లేదా నియంత్రణ సాధనంగా కాదు.
ఏఐలో ఆత్మనిర్భర్ భారత్ అంటే డిజిటల్ శతాబ్దం కోసం భారతదేశం తన సొంత కోడ్ను లిఖించుకోవడం. ఇండియా ఏఐ మిషన్ ద్వారా, ఆ కోడ్ మన విలువలను ప్రతిబింబించేలా, మన ప్రజలకు సేవ చేసేలా, ప్రపంచానికి బాధ్యతాయుతమైన ఏఐ నాయకుడిగా భారతదేశాన్ని నిలబెట్టేలా మేము చూస్తున్నాము.

More Stories
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన
“వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భారత్- ఫ్రాన్స్ సంబంధాలు
రాహుల్ గాంధీ వల్లే ముఖ్యమంత్రి పదవి రాలేదు