పారదర్శకంగా అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత లభించాలంటే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధిచెందుతున్న దేశాలకు బలంగా వాణిని వినిపించే అవకాశం లభించాలని ఆయన చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధిచెందుతున్న దేశాలకు కేంద్ర బిందువుగా భారత్ కనిపిస్తోందని పేర్కొంటూ ఈ అంశంపై తాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తానని పేర్కొన్నారు.
బహుళ ధ్రువ ప్రపంచం సాకారంలో భారత్ కీలక పాత్రను పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వైవిధ్యం, అద్భుత నాగరికత, సంస్కృతిలకు భారత్ నెలవని పేర్కొంటూ గత కొన్ని శతాబ్దాల్లో ప్రపంచ వికాసంలో భారత్ పోషించిన పాత్రపై ప్రస్తుతం తాను కొన్ని పుస్తకాలు, నివేదికలను చదువుతున్నానని చెప్పారు. క్రీస్తు పూర్వమే చైనా, ఆగ్నేయ ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలపైనా భారత నాగరికత, సంస్కృతిల ప్రభావం పడిందని పేర్కొన్నారు. రోమన్ సామ్రాజ్య కాలంలోనూ మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో భారత్కు బలమైన వాణిజ్య అనుబంధం ఉండేదని ఐరాస చీఫ్ తెలిపారు.
“ఈ ప్రపంచంలో రెండు అంశాలు జరగకుండా మనం అడ్డుకోవాలి. యావత్ ప్రపంచ వ్యవహారాలపై పెత్తనం ఒకే దేశం చేతిలో అస్సలు ఉండకూడదు. యావత్ ప్రపంచం రెండు సూపర్ పవర్ల మధ్య విభజితమై కూడా ఉండకూడదు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని” అని స్పష్టం చేశారు.
బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడాలంటే అభివృద్ధిచెందుతున్న దేశాలకు వాణిజ్యం, టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలలో చాలాచాలా కీలకమైన పాత్రలను పోషించే అవకాశాలు లభించాలని ఆయన సూచించారు. ఇటీవలే భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమే అందుకు మంచి ఉదాహరణ అని చెప్పారు.
భారత్ వికాసాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తోందని, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేక సమూహాలుగా ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమూహాల వల్లే నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం దిశగా బాటలు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల ఏదో ఒక దేశం పెత్తనానికి అవకాశం లేకుండా పోతోందని ఐరాస చీఫ్ చెప్పారు.
ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విఫలం కావడం పట్ల ఆయన ఆందోళనకర వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక ఘర్షణలను అది ఆపలేకపోతోందని, సరైన నిర్ణయాలను తీసుకునే స్థితిలో ఐరాస భద్రతా మండలి లేదని విచారం వ్యక్తం చేశారు. అందుకే దానిలో ప్రాథమిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.
“రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన భద్రతా మండలి అది. కానీ మనకు నేటి పరిస్థితులకు అనుగుణమైన ఐరాస భద్రతా మండలి కావాలి. ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణ కోసం సముచిత నిర్ణయాలను తీసుకునే రీతిలో భద్రతా మండలి నిర్మాణ స్వరూపం ఉండాలి” అని ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు.

More Stories
కాలిఫోర్నియాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ మృతి
కాలుష్య కారకులు ఎక్కువ భారం మోయాలి
అమెరికాతో వాణిజ్య ఒప్పందం .. అన్నదాతకు భరోసా