పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించిన సిఆర్‌పిఎఫ్

పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించిన సిఆర్‌పిఎఫ్
ఫిబ్రవరి 14, 2019న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో అమరులైన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందిని సత్కరించడానికి శనివారం పుల్వామాలోని లెత్‌పోరాలో ఘనంగా పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని సీఆర్పీఎఫ్ బస్సు కాన్వాయ్‌పైకి ఢీకొట్టి, 40 మంది సిబ్బందిని బలిగొని, డజన్ల కొద్దీ గాయపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులైన జవాన్లకు  సిఆర్‌పిఎఫ్, పౌర పరిపాలన, ఇతర భద్రతా దళాల అధికారులు హృదయపూర్వక నివాళులు అర్పించారు.
 
దేశంలో అమరులైన సైనికుల ధైర్యం, అంకితభావం, అత్యున్నత త్యాగానికి వేడుకలో పాల్గొన్న అధికారులు వందనం చేశారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో,  సిఆర్‌పిఎఫ్ ఇలా రాసింది: “మనం మర్చిపోకుండా ఉండేందుకు. ఫిబ్రవరి 14, 2019న, పుల్వామాలో 40 మంది  సిఆర్‌పిఎఫ్ జవాన్లు అత్యున్నత త్యాగం చేశారు. వారి శౌర్యం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. డిజి జిపి సింగ్, అన్ని శ్రేణులు మన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. మేము వారి కుటుంబాలతో దృఢంగా నిలబడతాము.”

2019లో జరిగిన పుల్వామా దాడిలో అమరులైన  సిఆర్‌పిఎఫ్​ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఇప్పటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. ‘2019లో ఈ రోజున పుల్వామాలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించుకుంటున్నాను. వారి సేవ, సంకల్పం, దేశభక్తి ఎప్పటికీ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. వారి అసమాన ధైర్యసాహసాల నుంచి ప్రతి భారతీయుడు స్ఫూర్తిని పొందుతాడు’ అని ప్రధాని మోదీ పోస్ట్​లో రాసుకొచ్చారు.

అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కూడా నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా నివాళులర్పించారు.

 

కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వీర జవాన్లకు నివాళులర్పించారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మన వీర సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్​లో పోస్ట్ చేశారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుల్వామా అమరవీరులకు నివాళ్లు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత మాత అమరవీరులకు ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్​లో పోస్ట్ చేశారు. వారి ధైర్యం, దేశభక్తి మనందరి ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. వారి త్యాగం ఎప్పటికీ మరచిపోలేమని ఖర్గే పోస్టులో రాసుకొచ్చారు.