2019లో జరిగిన పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఇప్పటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘2019లో ఈ రోజున పుల్వామాలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించుకుంటున్నాను. వారి సేవ, సంకల్పం, దేశభక్తి ఎప్పటికీ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. వారి అసమాన ధైర్యసాహసాల నుంచి ప్రతి భారతీయుడు స్ఫూర్తిని పొందుతాడు’ అని ప్రధాని మోదీ పోస్ట్లో రాసుకొచ్చారు.
అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా నివాళులర్పించారు.
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వీర జవాన్లకు నివాళులర్పించారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మన వీర సైనికులకు నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుల్వామా అమరవీరులకు నివాళ్లు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత మాత అమరవీరులకు ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. వారి ధైర్యం, దేశభక్తి మనందరి ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. వారి త్యాగం ఎప్పటికీ మరచిపోలేమని ఖర్గే పోస్టులో రాసుకొచ్చారు.

More Stories
మహిళా జర్నలిస్టుపై బ్రాహ్మణ కులం పేరుతో వామపక్షాల దాడి!
చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం
మార్చి 9కి పార్లమెంట్ సమావేశాలు వాయిదా