మెరుగైన భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్

మెరుగైన భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్
హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకింగ్ పెరిగింది. అంటే మన పాస్‌పోర్ట్ విలువ పెరిగింది.  తాజా హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌లో మన పాస్‌పోర్ట్ 75వ స్తానంలో నిలిచింది. గత ఏడాది ఇదే సమయంలో 85వ స్తానంలో ఉంది. అంటే ఇప్పుడు ర్యాంకింగ్‌లో 10 స్థానాలు ఎగబాకింది. 
 
గత జనవరిలో 80 వ ర్యాంక్‌కు చేరుకోగా, ఇప్పుడు మరో ఐదు ర్యాంకింగ్స్ మెరుగుపడి 75వ ర్యాంక్‌లో ఉంది. అయినా, భారత్ కు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య తగ్గింది. తాజాగా రెండు దేశాలు – ఇరాన్, బొలీవియా దేశాలు ఫ్రీ వీసా సౌకర్యాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే సమయంలో మన దేశానికి ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య ప్రస్తుతం 56గా ఉంది. 
 
గత నెలలో మనకు ఫ్రీ వీసా ఇచ్చే దేశాల సంఖ్య 55 కాగా, ఇప్పుడు 56కు చేరింది. అయితే, గత ఏడాది ఇదే సమయంలో ఈ దేశాల సంఖ్య 57గా ఉండేది. అంటే వీసా ఫీజు చెల్లించకుండా, పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా అప్పట్లో మన పాస్‌పోర్ట్‌తో 57 దేశాలకు వెళ్లగలిగే వీలుండేది. ఇప్పుడు ఇరాన్, బొలీవియా దేశాలు ఫ్రీ వీసా జాబితా నుంచి భారత్ ను మినహాయించాయి. అయితే, 57 దేశాల జాబితా నుంచి రెండు దేశాలు తప్పుకొంటే 55 దేశాలు ఉండాలి. కానీ, గాంబియా దేశం ఈ జాబితాలోకి తాజాగా చేరింది. భారతీయులకు ఫ్రీ వీసా ఇచ్చేందుకు అంగీకరించింది.  ఇకపై ఇరాన్, బొలీవియా దేశాలకు వెళ్లాలంటే ముందుగానే వీసా దరఖాస్తు చేసుకోవాలి. 

సాధారణంగా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ పెరిగితే ఉచిత వీసా ఇచ్చే దేశాల సంఖ్య పెరుగుతుంది. కానీ, భారతీయులు ఇరాన్, బొలీవియా వంటి దేశాలు వెళ్లి అక్కడ సరైన ధృవపత్రాలు చూపించకపోవడం, నేరాలకు పాల్పడటం వంటి పనులు చేశారు. దీంతో ఆ దేశాలు ఇప్పుడు ఇండియన్స్ రాక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాయి.