శబరిమల బంగారం చోరీ కేసులో ఆలయ సిబ్బందిపై దర్యాప్తు 

శబరిమల బంగారం చోరీ కేసులో ఆలయ సిబ్బందిపై దర్యాప్తు 
శబరిమల ఆలయంలోని విలువైన కళాఖండాల నుండి బంగారం దొంగిలించబడిందనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న దర్యాప్తులో ఆలయ ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలి వార్షిక పండుగ సీజన్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల్లో భారీ అసమానతలు కనిపించడంతో, ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. 
 
నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు కొనసాగిన రెండు నెలల మాండల-మకర విలక్కు పండుగ సీజన్‌లో ఆలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది ఆర్థిక కార్యకలాపాలపై శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సమీక్షించింది. ఈ నివేదికలో ఆలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసుల ద్వారా జరిగిన నగదు బదిలీలు, అలాగే ఆ నిధుల మూలాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. ఆలయ పరిధిలో పనిచేస్తున్న వివిధ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించాలని, అలాగే పండుగ సీజన్‌లో సన్నిధానంలో విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి డేటాబేస్‌ను రూపొందించాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది. 

కేవలం తక్కువ వ్యవధిలోనే పోస్టాఫీసు మనీ ఆర్డర్ల ద్వారా మొత్తం రూ.14,08,880 బదిలీ అయినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తానికి సంబంధించి నిధుల మూలం, చట్టబద్ధతపై స్పష్టత లేకపోవడం తీవ్ర సందేహాలకు దారి తీసిందని విజిలెన్స్ అధికారి కోర్టుకు తెలిపారు.

కోర్టు పరిశీలనలో ఒక ఉద్యోగి పోస్టాఫీసు ద్వారా రూ.1,38,000 పంపగా, మరొక ఉద్యోగి రూ.1,07,450 పంపినట్లు గుర్తించారు. అంతేకాదు, మరో ముగ్గురు ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఇదే తరహా నగదు బదిలీ నమూనాలు కనిపించాయి. ఈ ఉద్యోగులను విచారణకు హాజరుకావాలని విజిలెన్స్ అధికారులు ఆదేశించినప్పటికీ  వారు ఆ ఆదేశాలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ పరిస్థితుల్లో సంబంధిత బ్యాంకులు, పోస్టల్ అధికారుల నుంచి లావాదేవీల పూర్తి వివరాలు సేకరించడం, ప్రతి అనుమానాస్పద లావాదేవీ వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలించడం అత్యవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి నిధి బదిలీపై వివరాలను సేకరించి, అవసరమైతే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టుకు హామీ ఇచ్చింది.