ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను, పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను, పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను, పాన్ కార్డు నిబంధనలలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. సామాన్యులకు, ఉద్యోగులకు ఊరటనిచ్చేలా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ, బ్యాంకుల్లో నగదు డిపాజిట్ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇప్పటి వరకు రోజుకు రూ. 50 వేలు దాటితే పాన్ కార్డు చూపించాల్సి ఉండగా, ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచనున్నారు. దీనివల్ల చిన్న వ్యాపారులు, సాధారణ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న మీల్స్ అలవెన్స్‌ను రోజుకు రూ. 50 నుంచి రూ. 200లకు పెంచే అవకాశం ఉంది.
 
పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల ఉద్యోగుల చేతికి అందే నికర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, ఖర్చులపై పాన్ కార్డు అవసరాన్ని ప్రభుత్వం సవరించింది. రూ. 5 లక్షలకు పైగా విలువైన మోటార్ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఇకపై పాన్ కార్డు అవసరమవుతుంది. 
 
అలాగే, హోటళ్లు లేదా రెస్టారెంట్లలో బిల్లు రూ. 1 లక్ష దాటితేనే పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పన్ను చెల్లింపుదారుల కోసం ముందే నింపిన ఫారమ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల తప్పులు దొర్లే అవకాశం తగ్గడమే కాకుండా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం కూడా ఆదా అవుతుంది.