ముంబై మేయర్‌గా రితూ తావ్డే

ముంబై మేయర్‌గా రితూ తావ్డే
ముంబై నగరం (బృహన్‌ ముంబై కార్పొరేషన్) మేయర్‌గా బీజేపీకి చెందిన రితూ తావ్డే, డిప్యూటీ మేయర్‌గా శివసేన (షిండే) వర్గానికి చెందిన సంజయ్ ఘాడీ ఎన్నికయ్యారు. బుధవారం ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఏకగ్రీవంగా ఇద్దరినీ ఎన్నుకున్నారు. దీంతో 25 ఏళ్లపాటు థాక్రే ఆధ్వర్యంలోని శివసేన చేతిలో ఉన్న ముంబై మేయర్ పదవి ఇప్పుడు బీజేపీ పరమైంది.

రితూ తావ్డే మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. ఆమె ఘట్‌కోపర్ (132వ వార్డు) స్థానం నుంచి ఇటీవల గెలిచారు. గతంలో బీఎంసీకి చెందిన ఎడ్యుకేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత 2012లో బీజేపీలో చేరారు. బీఎంసీలో జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు. రితూ, సంజయ్ ఎన్నికపై వారు హర్షం వ్యక్తం చేశారు. 

వారి నాయకత్వంలో ముంబై అభివృద్ధి చెందుతుందని, ప్రతి ముంబైకర్ ఆశల్ని నిజం చేస్తారని ఫడ్నవీస్ అన్నారు. రితూ తావ్డే బీజేపీ తరఫున ముంబైకి ఎన్నికైన రెండో మేయర్. చివరగా 1982-83 కాలంలో ప్రభాకర్ పాయ్ మేయర్‌గా పని చేశారు.

డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సంజయ్ ఘాడీ 15 నెలలు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత శివసేన (షిండే)కు చెందిన ఇతరులకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సంజయ్ ఘాడీ ఐదో వార్డు అయిన మగథానే నుంచి శివసేన తరఫున 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు ఆయన థాక్రే వర్గంలో ఉండేవారు. ఎన్నికలకు ముందు షిండే వర్గంలో చేరి, గెలిచారు.