భారీగా పెరుగుతున్న విమానాశ్రయాల యూజర్ చార్జీలు

భారీగా పెరుగుతున్న విమానాశ్రయాల యూజర్ చార్జీలు
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో వసూలు చేస్తున్న యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యుడిఎఫ్‌) గతకొన్నేళ్ల నుంచి భారీగా పెరుగుతోంది. విమానప్రయాణీకులపై అదనపు భారాన్ని మోపుతోంది. సిపిఎం ఎంపి డాక్టర్‌ వి.శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడయింది. దీనిపై ఎంపి శివదాసన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ ఇచ్చిన వివరాల ప్రకారం గత ఐదేళ్లలో యుడిఎఫ్‌, మొత్తం వసూళ్లులలో భారీ పెరుగుదల కనిపించింది. ఉదాహరణకు చెన్నై విమానాశ్రంలో 2020-21లో దేశీయ యుడిఎఫ్‌ రూ 69 ఉండగా, 2024-25కు ఇది ఏకంగా రూ 395కు పెరిగింది. అంటే ఏకంగా 472 శాతం పెరిగింది.  ఇదే విమానాశ్రయంలో అంతర్జాతీయ యుడిఎఫ్‌ రూ 69 నుంచి రూ 615కు పెరిగింది. అంటే ఇది ఏకంగా 791 శాతం పెరిగింది.
అహ్మదాబాద్‌లో దేశీయ యుడిఎఫ్‌ రూ85 నుంచి రూ 450కు, అంతర్జాతీయ యుడిఎఫ్‌ రూ85 నుంచి రూ880కు పెరిగింది. అంటే ఏకంగా 429 శాతం, 935 శాతం పెరిగాయి.  2020-21లో ఈ మొత్తం వసూళ్లు రూ. 946.94 కోట్లుగా ఉండగా, 2024-25లో ఏకంగా రూ.8,501.70 కోట్లుకు పెరిగింది. దీనిపై ఎంపి శివదాసన్‌ మాట్లాడుతూ యుడిఎఫ్‌ అనేది ప్రతీ ప్రయాణీకుడ్ని నుంచి వసూలు చేసే తప్పనిసరి ఫీజు. 
 
దీన్ని ఇంత భారీగా పెంచడం ప్రయాణీకులపై అదనపు భారాన్ని మోపుతోందని, ఈ అన్యాయమైన, భారీ ఫీజుల నుంచి ప్రయాణీకుల్ని రక్షించడానికి, ఈ ఫీజు విధానాన్ని తక్షణమే సమీక్షించాలని ప్రభుత్వాన్నికి, విమానాశ్రయ నియంత్రణ సంస్థకు విజ్ఞప్తి చేశారు.