స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం

స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు హస్తం పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే టిఎంసి దీనికి  దూరంగా ఉంది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సి ప్రకారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉందని చెప్పారు. “ఈరోజు మధ్యాహ్నం 1:14 గంటలకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు సమర్పించాం. మొత్తం 118 మందికి పైగా ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదేపదే నిరాకరిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, ఇటీవల జరిగిన పలు సంఘటనలు ఈ నిర్ణయానికి దారితీశాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై జనరల్ నరవణే స్మృతులను ప్రస్తావించేందుకు రాహుల్ ప్రయత్నించినప్పటికీ, స్పీకర్ అనుమతించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం కూడా పెద్ద వివాదంగా మారింది. తమ రాజ్యాంగ హక్కులను వినియోగించినందుకే ఈ చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.