జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గత ఏడాది జరిగిన సమావేశం గురించి మీడియాలో వచ్చిన కధనాలు “నిరాధారం” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆ భేటీలో అమెరికా అనుసరిస్తున్న భారత వ్యతిరేక ధోరణుల పట్ల దోవల్ అసహనం వ్యక్తం చేశారని, ట్రంప్ అధ్యక్ష పదవికాలం పూర్తయ్యేవరకు భారత్ వాణిజ్య ఒప్పందం కోసం వేచి ఉండగలదని బెదిరించారని వార్తలు వచ్చాయి.
ఆ బెదిరింపుతోనే ట్రంప్ అర్ధాంతరంగా వాణిజ్య ఒప్పందం జరిగిన్నట్లు ప్రకటించారని ఆ వార్తలు తెలిపాయి. ఈ కథనాలపై మీడియా ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “బ్లూమ్బెర్గ్ నివేదికకు సంబంధించి, ఆ నివేదికకు ఎటువంటి ఆధారం లేదు. అలాంటి సమావేశం లేదా అలాంటి సందర్శన జరగలేదు” అని తేల్చి చెప్పారు.
న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో గత ఏడాది సెప్టెంబర్లో దోవల్ అమెరికాకు వెళ్లారని ఆరోపిస్తూ మీడియా నివేదిక వెలువడిన తర్వాత ఎంఈఏ ఈ నివేదికలను తీవ్రంగా తోసిపుచ్చింది. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన సానుకూల టెలిఫోన్ కాల్ ను ఈ సందర్భంగా జైస్వాల్ గుర్తుచేశారు.
“పరస్పర సుంకాన్ని తగ్గించినందుకు అధ్యక్షుడు ట్రంప్కు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులు ఇప్పుడు 18% తగ్గిన సుంకంతో అమెరికాకు ఎగుమతి కాగలవని ప్రధాని పేర్కొన్నారు” అని చెప్పారు. “ఈ వాణిజ్య ఒప్పందం అమెరికాకు మన ఎగుమతులకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది భారతదేశంలోని శ్రమతో కూడిన పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది, మన ప్రజలకు వృద్ధి మరియు శ్రేయస్సును సృష్టిస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారని ఆయన వివరించారు.
మరోవంక, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కూడా ఈ ఆశావాద భావన ప్రతిబింబించింది. ఆయన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చలు జరిపి తన అమెరికా పర్యటనను “ఉత్పాదకత, సానుకూలత”గా అభివర్ణించారు. “భారతదేశం-అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వివరాల చివరి దశలో ఉంది. త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని జైశంకర్ చెప్పారు.
ఒక ఎక్స్ పోస్ట్లో, జైశంకర్ ఇలా అన్నారు, “అమెరికాకు ఉత్పాదక, సానుకూల పర్యటన ముగిసింది. కార్యదర్శి రూబియో తన హృదయపూర్వక ఆతిథ్యానికి ధన్యవాదాలు. చారిత్రాత్మక భారతదేశం-యుఎస్ వాణిజ్య ఒప్పందం వివరాల చివరి దశలో ఉంది. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇది మా ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త దశను తెరుస్తుంది. ఈ సంబంధానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. మా కీలకమైన ఖనిజ సహకారం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రోజుల్లో వ్యూహాత్మక సమస్యలు, రక్షణ, ఇంధనంపై సహకారాన్ని ఆశించండి. మొత్తంమీద, బలమైన ఊపు స్పష్టంగా ఉంది.”
కాగా, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్తో జరిపిన చర్చలు “అపరిమితమైన సామర్థ్యాన్ని” సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

More Stories
మహిళల ప్రీమియర్ లీగ్ విజేత బెంగళూరు
రష్యా చమురు దిగుమతిని భారత్ పూర్తిగా ఆపలేదు
భారత్ వాణిజ్య ఒప్పందాలతో స్థిరత్వంపై ప్రపంచ విశ్వాసం