రష్యా చమురు దిగుమతిని భారత్‌ పూర్తిగా ఆపలేదు

రష్యా చమురు దిగుమతిని భారత్‌ పూర్తిగా ఆపలేదు
 
* భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై రష్యా అధినేతల ధీమా
 
రషా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని, అందుకే భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 2వ తేదీన ప్రకటించారు. అయితే తమ నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదని రష్యా నేతలు ఇప్పటికే వెల్లడించారు.  పైగా, రష్యా నుండి చమురు దిగుమతిని భారత్‌ పూర్తిగా ఆపివేయలేదని  జాతీయ ఇంధన భద్రతా నిధిలో ప్రముఖ నిపుణుడు ఇగోర్‌ యుష్కోవ్‌ స్పష్టం చేశారు. 
రష్యా భారత్‌కు రోజుకి 1.5మిలియన్‌ బ్యారెల్సనుండి 2మిలియన్‌ బ్యారెల్స్‌ వరకు సరఫరా చేస్తుంది. అయితే అమెరికా అంత మొత్తంలో సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ”అమెరికా ఎగుమతి చేసే ముడి చమురు గ్యాస్‌ కండెన్సెట్‌ మాదిరిగానే తేలికపాటి గ్రేడ్‌లను కలిగి ఉంటుంది. అదే సమయంలో రష్యా సల్ఫర్‌ అధికంగా ఉండే ఉరల్‌కి చెందిన చమురును సరఫరా చేస్తుంది. దీనర్థం భారతదేశం అమెరికా నుండి దిగుమతి అయ్యే ముడిచమురును ఇతర గ్రేడ్‌లతో కలపవలిసి వుంటుంది. దీనికోసం అధనంగా ఖర్చు చేయాల్సి వుంటుంది” అని ఆయన గుర్తు చేశారు. 

దీంతో భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్‌ ముడి చమురు దిగుమతిని పూర్తిగా నిలువరించలేవని ఆయన పేర్కొన్నారు.  ట్రంప్ ఈ వాణిజ్య చర్చలలో తాను గెలిచానని, ఒప్పందం పూర్తిగా అమెరికా డిమాండ్లకు అనుగుణంగా జరిగిందని చూపించడానికి  ప్రయత్నిస్తున్నారనే భావన కలుగుతుందని ఎద్దేవా చేశారు.  చివరిసారిగా, 2022లో రష్యా యూరోపియన్‌, అమెరికన్‌ మార్కెట్ల నుండి భారత మార్కెట్‌కు మారినపుడు, అది రోజుకు 1మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించడంతో,  ధరలు బ్యారెల్‌కు 120డాలర్లకు పెరిగాయని తెలిపారు. అమెరికా గ్యాసోలీన్‌, డీజిల్‌ ధరలకు జీవితకాల గరిష్ట ధర నిర్నయించిందని యుష్కోవ్‌ గుర్తుచేసుకున్నారు.

ట్రంప్‌ ప్రకటనపై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మీడియాతో మాట్లాడారు. ఏ దేశం నుండైనా చమురును కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. భారతదేశానికి చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను రష్యా మాత్రమే సరఫరా చేయదని తమకు, అలాగే ఇతర అంతర్జాతీయ ఇంధన నిపుణులకు తెలుసునని కూడా చెప్పారు. 

ఈ ఉత్పత్తులను భారత్‌ ఇతర దేశాల నుండి కూడా కొనుగోలు చేస్తుందని, దీంతో ఈ ప్రకటన కొత్తగా ఏమీలేదని ఆయన తెలిపారు. పైగా, చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు భారత్‌ నుండి ఎటువంటి ప్రకటన రష్యాకు రాలేదని పెస్కోవ్‌ మంగళవారం వెల్లడించారు.  పెట్రోఉత్పత్తుల వాణిజ్యం భారత్‌, రష్యా రెండు దేశాలకు లబ్థి చేకూర్చాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జెక్రోవా పేర్కొన్నారు.

భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహద పడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. భారతదేశం తమ భాగస్వాములతో ఈ రంగంలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె మీడియాతో తెలిపారు.