జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూలోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్, ఉధంపూర్ జిల్లా, బంసంత్‌ఘర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పుల్లో జైషే మహ్మద్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మావి అలియాస్ మావియా మరణించినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతోపాటు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్ కు “కియా” అని పేరు పెట్టిన సైన్యం, ఆ ప్రాంతం ఇంకా నిఘాలోనే ఉందని తెలిపింది.  ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు గతంలోనే పోలీసులకు సమచారం అందింది. తాజాగా తీవ్రవాదులకు సంబంధించిన మరింత కీలక సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా జమ్మూ పోలీసులకు అందింది. దీంతో మంగళవారం నుంచి అక్కడ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. 

ఈ క్రమంలో తీవ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకడు మావి కాగా, మరొకడు జబ్బార్ గా గుర్తించారు. తీవ్రవాదులు ఇక్కడి అటవీ ప్రాంతంలోని ఒక గుహలో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ గుహను పోలీసులు పేల్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు, భద్రతా సిబ్బంది సమన్వయంతోనే తీవ్రవాదుల ఎన్‌కౌంటర్ సాధ్యమైందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

“పోలీసులు, కౌంటర్-ఇంటెలిజెన్స్ ఫోర్స్ డెల్టా దళాలు అందించిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, వైట్ నైట్ కార్ప్స్ బసంత్ గఢ్ లోని జోఫర్ ఫారెస్ట్ జనరల్ ఏరియాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సమన్వయంతో కార్డన్ ను బలోపేతం చేస్తూ, ఉగ్రవాదులు తప్పించుకోకుండా నిరోధించడానికి సమర్థవంతమైన ప్రాంత ఆధిపత్యాన్ని నిర్ధారిస్తూ ఒక కేంద్రీకృత ఉమ్మడి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ను ప్లాన్ చేసి అమలు చేసింది” అని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ లో ఒక పోస్ట్ లో తెలిపింది.
 
“నిన్న ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి, ఉగ్రవాదులు సంబంధాలు తెగిపోకుండా అడ్డుకున్నాము. సమన్వయంతో కూడిన ప్రతిస్పందన తర్వాత, ఇద్దరు ఉగ్రవాదులను విజయవంతంగా తటస్థీకరించారు. ఈ ఆపరేషన్ అతుకులు లేని ఇంటర్-ఏజెన్సీ సమన్వయం, వ్యూహాత్మక ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంల ఉన్నత ప్రమాణాలను వెల్లడి చేస్తుంది” అని ఆ పోస్ట్ లో తెలిపారు. 
 
ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని పేర్కొంటూ అయినా “ఈ ప్రాంతం నిఘాలో ఉంది” అని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులలో ఒకరి మృతదేహం సహజ గుహ ముఖద్వారం వద్ద ఉండగా, మరొకరు దాని లోపల లోతుగా పడి ఉన్నట్లు కనుగొన్నారు. హతమైన ఉగ్రవాదుల నుండి ఎం4 కార్బైన్. ఎకె  అస్సాల్ట్ రైఫిల్ సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.