5-6 తేదీల్లో బంగాళాఖాతం మీదుగా ‘నోటమ్‌’ జారీ

5-6 తేదీల్లో బంగాళాఖాతం మీదుగా ‘నోటమ్‌’ జారీ
2026 ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతం మీదుగా సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో క్షిపణి పరీక్షల కోసం భారత్‌ ‘నోటమ్‌’ జారీ చేసింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోటమ్ పరిమితిని ఇప్పుడు సుమారు 3,190 కిలోమీటర్లకు పెంచినట్లు తెలుస్తోంది. నోటమ్‌ అంటే ఎయిర్‌మెన్‌కు నోటీసులు ఇవ్వడం.  నిర్దిష్ట గగనతలంలో నిర్దిష్ట కాలంలో ప్రమాదాలు, ప్రయాణ పరిమితుల గురించి పౌర, సైనిక విమానయానానికి తెలియజేసేందుకు ఇచ్చే అధికారిక నోటీసును నోటమ్‌ అంటారు. 

సాధారణంగా క్షిపణి పరీక్షలు, రాకెట్‌ ప్రయోగాలు, సైనిక విన్యాసాలు లేదా యుద్ధ పరిస్థితులలో ముందస్తు హెచ్చరికగా ఈ నోటీసులు జారీ చేస్తారు. క్షిపణి పరీక్షల కోసం భారత్‌ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రక్షణ శాఖ క్షిపణి ప్రయోగ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతం గగనతలంలో ఎలాంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతి ఉండబోదని తెలిపాయి. 

ఈ ప్రాంతంలో విమానాలు, నౌకల ప్రవేశంపై పరిమితులు విధించారు. ఇటీవలి కాలంలో రక్షణ రంగంలో భాగంగా డిసెంబర్‌ 2025లో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. తాజా నోటమ్‌తో, భారత్‌ తన సముద్ర-ఆధారిత అణు నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది.  అయితే క్షిపణుల ప్రయోగంపై భారత ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్‌ స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలు క్షిపణి పరీక్షలను చురుకుగా నిర్వహిస్తోంది.