* 2025లో 11 శాతం తగ్గిన డిమాండ్
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించి పెరిగిన బంగారం ధరలుశుక్రవారం ఒక్కసారిగా ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారీ స్థాయిలో తగ్గాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.8 వేల మేర, వెండి ధర రూ.15 వేల మేర తగ్గింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా తగ్గిందన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.8,230 మేర తగ్గి రూ.1,70,620కు చేరింది.
22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.7550 మేర తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి రూ.4,15,000గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఇది రూ.10 వేలు తక్కువ. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 70 శాతం మేర పెరిగాయి. స్థూలంగా చూస్తే ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో మార్చి డెలివరీ కాంట్రాక్టులో ప్యూచర్స్లో వెండి ధర నేడు ఒక్కరోజే రూ. 22,090 పెరిగి, రూ.4,07,456 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి డెలివరీ కాంట్రాక్టుకు బంగారం ప్యూచర్స్ పది గ్రాముల ధర కూడా రూ.14,586 పెరిగి, రూ.1,80,501కి చేరింది. ఔన్సు వెండి ధర మొదటిసారిగా 5,600 డాలర్ల మార్కును దాటేసింది. కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ డెలివరీకి ఔన్సు ధర 5,626.8 డాలర్లు ఉంది. ఔన్లు వెండి ధర 119.51 డాలర్లకు చేరువైంది.
అమెరికా డాలర్ విలువ పడిపోవడంతో వెండి ధర పెరిగిపోతోంది. గత వారాంతం ట్రంప్ గ్రీన్ ల్యాండ్ విషయంలో సైనికచర్యను తోసిపుచ్చడం, బోర్డు అఫ్ పీస్ అంటూ శాంతి మంత్రాన్ని పఠించడంతో ఒకింత బంగారం శాంతిస్తుందనే సంకేతాలు కనిపించాయి. అయితే, మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల మోహరింపు, ఇరాన్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇవ్వడం, అతికీలకమైన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ బలమైన పట్టు నేపథ్యంలో అనిశ్చితి అలానే కొనసాగుతుంది. అమెరికన్ నౌకలు ఇరాన్ ని సమీపించడం, ఇజ్రాయెల్ ప్రకటనలు, దానికి ఇరాన్ కౌంటర్లు వెరసి బంగారం ధర గరిష్టంకు చేరుకుంది.
కాగా, 2025లో దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ 11 శాతం తగ్గి 700 టన్నులకు పడిపోయినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతోపాటు కొనుగోలుదారులు వెనుకంజ వేయడం కూడా డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషించింది. మొత్తంమీద గతేడాది గోల్డ్ డిమాండ్ 11 శాతం తగ్గి 710.9 టన్నులకు తగ్గగా 2026లో 600 నుంచి 700 టన్నుల మధ్యలో నమోదుకానున్నట్టు ముందస్తు అంచనాను విడుదల చేసింది.
2024లో మాత్రం 802.8 టన్నుల గోల్డ్ అమ్మకాలు జరిగింది. విలువ పరంగా చూస్తే 2025లో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవడంతో వీటి విలువ 30 శాతం ఎగబాకి రూ.7,51,490 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,75,930 కోట్లుగా ఉన్నది.

More Stories
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 352 ఎంపీ సీట్లు
గవర్నర్ ఫోన్ ట్యాప్ చేస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
జెలెన్స్కీని శాంతి చర్చల కోసం మాస్కోకు ఆహ్వానించిన రష్యా