పార్లమెంట్లో కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుయోగ్య భూ విస్తీర్ణం పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు విస్తీర్ణం మెరుగుపడినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోందని పేర్కొంది.
తెలంగాణలో సాగు యోగ్య భూ విస్తీర్ణం 2014-23 మధ్య 1.31 కోట్ల ఎకరాలు ఉందని, అది 2.21 కోట్లకు పెరిగినట్లు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్లడించింది. తయారీ రంగంలో తెలంగాణ 5 % వాటా నమోదు చేసినట్లు పేర్కొంది. ఏఐ స్టార్టప్ల్లో తెలంగాణ వాటా 7 % కాగా 30 శాతంతో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఫైనాన్స్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల వాటా 40 శాతంగా ఉంది. భూభారతి పోర్టల్ ద్వారా స్టాంప్స్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల విభాగాలను తెలంగాణ రాష్ట్రం ఏకీకృతం చేసినట్లు పేర్కొంది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగారాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం, ఏపీలోని విజయవాడ 10వ స్థానంలో నిలిచాయి. 2035 సంవత్సరం నాటికి హైదరాబాద్ జీడీపీ 201.4 బిలియన్ డాలర్లు, విజయవాడ 21.3 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. దేశంలో జీవనయోగ్య నగరాల్లో టాప్ 10లో విజయవాడ, తిరుపతి నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 8.61 శాతం నుంచి 0.20 శాతానికి దిగిందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 1.72 శాతం కంటే తక్కువగా నమోదైందని పేర్కొంది. ప్రకృతి ప్రకోపాలు, అకాల వర్షాల కారణంగా వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని వెల్లడించింది.
నూతన నగరాల విస్తరణ, డెవలప్మెంట్ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించింది. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని వెల్లడించింది. వాణిజ్య సంస్కరణల కార్యాచరణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, దీని కారణంగా ఏపీలో వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందని తెలిపింది. సింగిల్ విండో ద్వారా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడాన్ని ఈ సందర్భంగా సర్వే పేర్కొంది.
ఏపీలో 6,900 గ్రామాల్లో 81 లక్షల భూకమతాల రీ సర్వే, 86 వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని పేర్కొంది. ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఏపీ, పంజాబ్, గుజరాత్కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని సర్వే వెల్లడించింది.

More Stories
బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిపై దర్యాప్తు జరపాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు
మున్సిపల్ ఎన్నికల వ్యూహంలో బిజెపి కేంద్ర నాయకులు