ధర్మేంద్రకు పద్మ విభూషణ్‌, అచ్యుతానందన్‌కు పద్మభూషణ్‌

ధర్మేంద్రకు పద్మ విభూషణ్‌, అచ్యుతానందన్‌కు పద్మభూషణ్‌
* తెలుగు రాష్ట్రాల నుండి 11 మందికి పద్మ అవార్డులు
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఐదుగురిని పద్మ విభూషణ్‌, 13 మందిని పద్మ భూషణ్‌, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.  ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు.  ఏపీ, తెలంగాణకు చెందిన మొత్తం 11 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. 

బాలీవుడ్‌లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. కేరళకు చెందిన కె.టి.థామ్‌స్‌, సాహితీవేత్త పి.నారాయణన్‌కు కూడా పద్మవిభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు ఎన్.రాజాంకు పద్మవిభూషణ్ ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వం ప్రముఖ గాయని ఆల్కా యాజ్ఞిక్‌, మాజీ గవర్నర్ భగత్‌సింగ్‌ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించింది. వైద్యరంగంలో తమిళనాడుకు చెందిన కళ్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు నోరి దత్రాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

శిబూసోరేన్‌కు పద్మభూషణ్: కళల విభాగంలో మళయాళం దిగ్గజ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్‌ పాండేకు మరణానంతరం పద్మభూషణ్, సామాజిక సేవారంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మయిలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందన శకవర్ధనీ గణేష్‌కు మూడో అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరేన్‌కు మరణానంతరం, వి.కె.మల్హోత్రాకూ పద్మభూషణ్ ప్రకటించారు. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్‌, క్రీడారంగంలో విజయ్‌ అమృతరాజ్‌లను పద్మభూషణ్‌, రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హాకీ క్రీడాకారిణి సవిత పూనియాకు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను హతమార్చిన ఎప్‌టీఎఫ్‌కు నేతృత్వం వహించిన సీఆర్‌పీఎఫ్‌ మాజీ డీజీ కే విజయ్‌ కుమార్‌ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.

తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్‌), దీపికా రెడ్డి (నృత్యకారిణి), గూడూరు వెంకట్రావు (వైద్యం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్‌ (సైన్స్‌, ఇంజినీరింగ్‌), కుమారస్వామి తంగరాజ్‌ (సైన్స్‌, ఇంజినీరింగ్‌), పాల్కొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశు సంవర్ధక, పాడి పరిశ్రమ) ఉన్నారు.

యూజీసీ మాజీ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌కు ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఏపీ నుంచి నటుడు గద్దె బాబూ రాజేంద్రప్రసాద్‌ (కళలు), మాగంటి మురళీ మోహన్‌ (కళలు), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం)కి పద్మశ్రీ ప్రకటించారు. మొత్తంగా ఈ ఏడాది 131 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మొత్తం అవార్డు గ్రహీతల్లో 90 మంది మహిళలు ఉన్నారు. జాబితాలో విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐ, పీఐవో, ఓసీఐ క్యాటగిరీ కింద ఆరుగురికి అవార్డులు ప్రకటించారు. మరణానంతరం 16 మందికి అవార్డులు ప్రకటించారు.

పద్మశ్రీ అవార్డుల్లో గుర్తింపు పొందని వీరుల (అన్‌సంగ్‌ హీరోస్‌) విభాగంలో అతి పెద్ద ఉచిత గ్రంథాలయాన్ని నెలకొల్పిన మాజీ బస్‌ కండక్టర్‌ అంకె గౌడ, ఆసియాలోనే మొదటి మానవ మిల్క్‌ బ్యాంక్‌ను స్థాపించిన పిల్లల వైద్య నిపుణురాలు అర్మిదా ఫెర్నాండెజ్‌, అరుదైన వాద్యం వాయించే 90 ఏండ్ల సంగీతకారుడు భిక్లయ లడ్క్య దిండా ఉన్నారు. కర్ణాటకకు చెందిన అంకె గౌడ 20 భాషల్లోని 20 లక్షల పుస్తకాలు సేకరించి ప్రజల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇక ఆసియాలోనే మొట్టమొదటి మానవ పాల బ్యాంక్‌ వ్యవస్థాపకురాలిగా మహారాష్ట్రకు చెందిన శిశువైద్యురాలు ఆర్మిడా ఫెర్నాండెజ్‌ పేరు పొందారు. మహారాష్ట్రకు చెందిన సంగీతకారుడు భిక్లయ లడ్క్య దిండా సొరకాయ బుర్ర, వెదురుతో తయారు చేసిన తర్పా అనే అరుదైన వాద్యాన్ని వాయించడంలో నేర్పరి. ఈ క్యాటగిరీలో మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డు దక్కింది.