ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసుల సోదాలు!

ఈడీ కార్యాలయంపై జార్ఖండ్ పోలీసుల సోదాలు!
జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంపై ఆ రాష్ట్ర పోలీసులు దాడి చేశారు. ఈడీ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయాన్ని పోలీసులు సోదా చేయడం కలకలం రేపింది. రూ.23 కోట్ల నీటి సరఫరా కుంభకోణంలో విచారణ సందర్భంగా ఈడీ అధికారులు తనను కొట్టినట్లు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మాజీ ఉద్యోగి సంతోష్ కుమార్ ఆరోపించాడు. 

జనవరి 12న అతడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, జనవరి 15న డీఎస్పీ స్థాయి పోలీస్‌ అధికారి, రాంచీ విమానాశ్రయ పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో కూడిన పోలీస్‌ బృందం రాంచీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నది. ఈడీ జోనల్‌ ఆఫీస్‌లో పోలీసులు సోదా చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను తీసుకెళ్లారు. సంతోష్‌పై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

మరోవైపు తమ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడంపై జార్ఖండ్ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఈడీ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది.   ఈడీ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ డ్వైడ్, కేంద్ర సంస్థ రాంచీ కార్యాలయంపై ఇటీవల జరిగిన పోలీసుల దాడి ప్రాథమికంగా “ముందస్తు ప్రణాళికతో కూడినది” అని కనిపిస్తోందని పేర్కొన్నారు. .

ప్రభుత్వ ఉద్యోగి సంతోష్‌పై ఈడీ దాడి కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది. అక్కడ ఏదైనా భద్రతా లోపం జరిగితే రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) రాకేష్ రంజన్‌ను బాధ్యుడ్ని చేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో కేంద్ర హోం కార్యదర్శిని ఒక పక్షంగా చేర్చాలని ఈడీకి హైకోర్టు సూచించింది.

అలాగే ఈడీ కార్యాలయం, ఈడీ అధికారులకు భద్రత కోసం సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ లేదా ఇతర పారామిలిటరీ దళాన్ని నియమించాలని కేంద్ర హోం కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాంచీ ఈడీ కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించారు. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా జరిగిన ఈ సంఘటన జార్ఖండ్‌లో రాజకీయ దుమారానికి దారి తీసింది.