బంగ్లాదేశ్‌, చైనా కదలికలపై నిఘాకు నౌకాదళ స్థావరం

బంగ్లాదేశ్‌, చైనా కదలికలపై నిఘాకు నౌకాదళ స్థావరం

చైనా, బంగ్లాదేశ్ ల నుండి భద్రతా పరమైన సమస్యలు ఎదురుకాగల దృష్ట్యా నిఘాను మరింత కట్టుదిట్టం చేయడానికి భారత్ సిద్ధమైంది. ఉత్తర బంగాళాఖాతంలో దాయాదుల చర్యలపై కన్నేసేందుకు మరో నౌకాదళ స్థావరాన్ని (నేవీ బేస్) ఏర్పాటు చేసేందుకు భారత నావికాదళం సిద్ధం అయింది. బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్ తీరం హల్దియాలో కొత్త నౌకాదళ స్థావంరం ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటికే ఉన్న హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో స్వల్ప స్థాయి యుద్ధ నౌకల్ని మోహరించడానికి అనువుగా విస్తరణ పనులు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే హల్దియా నేవీ బేస్‌లో  ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌లు  (ఎఫ్ఐసి), 300-టన్నుల న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లను (ఎన్ డబ్ల్యుజెఎఫ్ఏ) మోహరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇవి గంటకు 40–45 నాట్ల వేగంతో ప్రయాణించగలవు.

ఎమర్జెన్సీ సమయంలో త్వరితగతిన స్పందించడానికి ఈ నౌకలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా అవి సీఆర్ఎస్-91 గన్స్ ఈ నౌకల్లో ఉంటాయి. నాగస్త్ర వ్యవస్థ కూడా అమర్చి ఉంటుంది. అందుకే వీటిని వేగంగా ప్రతిస్పందించడానికి, నిఘా ఉంచడానికి ఉపయోగిస్తారు. హల్దియా బేస్‌లో ఇలాంటి నౌకలు ఉంటే.. అత్యవసర సమయాల్లో శత్రు దేశాల కుట్రలను తిప్పికొట్టడంలో కీలకంగా మారుతాయి.

ఇటీవలి కాలంలో హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నేవీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గాల ద్వారా అక్రమ చొరబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో కొత్త బేస్ ఏర్పాటు చేయాలని భారత నావికాదళం భావించింది. ఈ నౌకాదళ స్థావరం భారత్‌కు వ్యూహాత్మకంగా అదనపు బలంగా మారుతుంది.

కాగా, ఇక్కడ వంద మంది వరకు నేవీ ఆఫీసర్లు, నావికా సిబ్బంది పని చేయనున్నట్లు తెలుస్తోంది.  కొత్తగా ఏర్పాటు కానున్న హల్దియా నేవీ బేస్ కోల్‌కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బేస్ సిద్ధమైతే హుగ్లీ నది ద్వారా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.  దీన్ని దృష్టిలో పెట్టుకునే 2024లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఏసి) సమావేశంలో 120 ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్‌లు, 31 ఎన్ డబ్ల్యుజెఎఫ్ఏ సిల సేకరణకు అనుమతి ఇచ్చారు. 

కాగా, భారత నౌకాదళానికి తూర్పు సముద్ర తీరంలో నేవీ బేస్‌లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నంలోని తూర్పు నావీ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక అండమాన్ నికోబార్ దీవులలోని కీలక నేవీ స్థావరాలు ఉన్నాయి. కాగా, హల్దియా స్థావరం కోసం గతంలో భూమిని కేటాయించినప్పటికీ నిర్మాణం కొంతకాలంగా పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు.