సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి

సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి

స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని చెబుతూ  వారిని ఎదుర్కోవడానికి భారతదేశం అప్రమత్తంగా, ఐక్యంగా మరియు బలంగా ఉండాలని  ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హెచ్చరించారు.  1026లో మహమూద్ గజనీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆలయ చరిత్ర విధ్వంసం లేదా ఓటమికి సంబంధించినది కాదని, విజయం, పునరుజ్జీవనానికి సంబంధించినదని తెలిపారు. 

“సోమనాథ్ చరిత్ర విధ్వంసం, ఓటమికి సంబంధించినది కాదు, విజయం మరియు పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కాలచక్రం, మతతత్వ దురాక్రమణదారులు ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితమయ్యారు, కానీ సోమనాథ్ ఆలయం మాత్రం నేటికీ సగర్వంగా నిలబడి ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.  స్వాతంత్రత్యానంతరం దేశ చరిత్రను చెరిపివేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ఆరోపిస్తూ నిజమైన చరిత్రలోని హింస, ద్వేషం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి, సంపంద కోసం సోమనాథ్​పై దాడి చేశారని చెప్పారని గుర్తు చేశారు.

సర్దార్ పటేల్​ సోమనాథ్ ఆలయాన్ని పునర్​ నిర్మించాలని అనుకుంటే చాలా మంది అడ్డుకున్నారని విమర్శించారు.  వెయ్యేళ్ల క్రితం దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నామని భావించారని, కానీ నేటికీ ఆలయంపై జెండా ఎగురుతుందని, ఇదే భారత శక్తి సామర్థ్యాలను, బలాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని ఆయన స్పష్టం చేశారు.

“గజినీ నుంచి ఔరంగజేబ్​ వరకు అనేక మంది సోమనాథ్​ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అచ్చం అలాగే మన దేశాన్ని నాశనం చేసేందుకు విదేశీ దురక్రామణదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు సోమనాథ్​ను, భారత్​ను ఏం చేయలేరు. 1,000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు సోమనాథ్ ఆలయం కోసం వారి ప్రాణాలను అర్పించారు. దురాక్రమణదారులు ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధించామని అనుకున్నారు. కానీ వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయంపై ఇంకా జెండా ఎగురుతూనే ఉంది” అని తెలిపారు. 
 
భారత అస్థిత్వానికి, గౌరవానికి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్​ అనేది ప్రతీక అని పేర్కొంటూ ఒకవేళ సోమనాథ్​ ఆలయం సంపద కోసమే అయితే, మొదటి సారి జరిగింది సరిపోయేదని, కానీ ఆలయంపై పదేపదే దాడి చేసి దేవుడిని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమనాథ్​ స్వాభిమాన్ యాత్రకు వెయేళ్లు, ఆలయ పునర్ నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు.

అంతకుముందు సోమ్‌నాథ్‌లో స్వాభిమాన్ పర్వ్‌లో భాగంగా నిర్వహించిన శౌర్వ యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పూలతో ఆలంకరించిన వాహనంలో యాత్రలో పాల్గొన్న ఆయన, మధ్యలో డమరుకం మోగించారు. ఇందులో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ పాల్గొన్నారు. యాత్ర తర్వాత సోమ్‌నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు.
 
వలసవాదుల దాడుల నుంచి సోమ్‌నాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా, హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.