బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు!

బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు!
* ఈడీ దాడుల తర్వాత ఉద్రిక్తంగా మారిన బెంగాల్ రాజకీయాలు 
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా,  గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. “నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం” అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది.గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ (రాజ్‌భవన్) వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
 

గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌కు “విల్‌ బ్లాస్ట్‌ హిమ్‌” అంటూ పేలుడు హెచ్చరికతో కూడిన బెదిరింపు ఈమెయిల్‌ అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నాయకుడు అమిత్‌ మాల్వియా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మమతా బెనర్జీ పాలనలో గవర్నర్‌కే భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయింది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, “హోంమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీ, బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ సంస్థను కాపాడేందుకు ఈడీ నుంచి కీలక ఫైళ్లను లాక్కునే పనిలో బిజీగా ఉన్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఇదిలా ఉండగా, గురువారం బంగాల్‌లో  నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ కార్యాలయాలు, దాని చీఫ్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసానికి వెళ్లారు. ఈడీ చర్యలను ప్రశ్నించిన మమతా, పార్టీకి సంబంధించిన హార్డ్‌డిస్కులు, అభ్యర్థుల జాబితాలు, వ్యూహాత్మక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో బీజేపీ- టీఎంసీ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. జనవరి 9న కోల్‌కతాలో ఈడీ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో నిరసన చేపట్టనున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ ఏడాది తొలి భాగంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిణామాలపై గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ అమలుకు సహకరించాలి. ప్రజాసేవకుడు తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) ప్రకారం నేరం. అదే విధంగా బెదిరించడం, భయపెట్టడం మరింత తీవ్రమైన నేరం” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ హోదాలో ఉన్నారని, ఆమె చర్యలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అన్న అంశంపై నిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే విషయం న్యాయస్థానంలో ఉన్నందున (సబ్‌జుడిస్‌) తాను తుది వ్యాఖ్య చేయబోనని స్పష్టం చేశారు.

ఈడీ ఇప్పటికే కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దాడుల సమయంలో అక్రమ జోక్యం జరిగిందని, దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. ఈడీ ప్రకారం, బొగ్గు అక్రమ రవాణా కేసులో కీలక ఆధారాల కోసం శాంతియుతంగా తనిఖీలు జరుపుతుండగా ముఖ్యమంత్రి, ఆమె సహచరులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించింది.  ప్రతీక్‌ జైన్‌ నివాసం, ఐ-ప్యాక్‌ కార్యాలయాల నుంచి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. 

కాగా, ఐ-ప్యాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ తన పరిధిని అతిక్రమించి, మరో రాజకీయ పార్టీ ఆదేశాల మేరకు ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఐ-ప్యాక్ కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ఈడీ “నిబంధనలను ఉల్లంఘించిందని” ఆరోపించింది. “ఈ దాడి రాజకీయ ప్రేరేపితమైనది. ఇది ఒక పార్టీకి సేవ చేయడానికి మరో పార్టీని లక్ష్యంగా చేసుకోవడమే దీని ఉద్దేశ్యం,” అని దాని న్యాయవాది పేర్కొన్నారు.

ఇదే సమయంలో టీఎంసీ మాత్రం బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. “ఎన్నికల వ్యూహాలు, పార్టీ పత్రాలు స్వాధీనం చేసుకోవడమే ఈడీ దాడుల అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి” అంటూ సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది.