పాకిస్తాన్ నుంచి వైదొలిగిన టెలికాం దిగ్గజం టెలినార్

పాకిస్తాన్ నుంచి వైదొలిగిన టెలికాం దిగ్గజం టెలినార్
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో పడిపోతున్న పాకిస్థాన్‌లో విదేశీ కంపెనీలు వదిలి వెళ్లే పరిస్థితి నెలకొంది.  తాజాగా, నార్వేతో చెందిన టెలికాం దిగ్గజం టెలినార్ గ్రూప్ పాకిస్థాన్‌లోని వ్యాపారాన్ని పూర్తిగా ముగించుకుని ఆ దేశం నుంచి వైదొలగింది. కంపెనీ ఆ ప్రాంతంలోని కార్యకలాపాలను స్థానిక పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్ (పిటిసిఎల్)కి అమ్మే ప్రక్రియను కూడా పూర్తిగా పూర్తిచేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
 
2023 డిసెంబర్‌లో ప్రకటించిన ఈ డీల్ విలువ 5.3 బిలియన్ నార్వేజియన్ క్రోనర్ గా ఉందని టెలినార్ తన ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్‌లో వ్యాపార వాతావరణం అత్యంత క్లిష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్థాన్ నుంచి వైదొలగిన కంపెనీల జాబితాలో టెలినార్ కూడా చేరింది.  అంతకుముందు ఖతార్‌కు చెందిన అల్ థానీ గ్రూప్, షెల్ పెట్రోలియం, ఫ్రెంచ్ ఆయిల్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు కూడా పాక్‌ను వీడాయి. 
ప్రభుత్వం బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం, పాకిస్థానీ రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ఈ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి.  చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో కీలకమైన పోర్ట్ ఖాసిం పవర్ ప్రాజెక్టు నుంచి అల్ థానీ గ్రూప్ తన వాటాను ఉపసంహరించుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 288 మిలియన్ల బకాయిలు పేరుకుపోవడమే దీనికి కారణమని యూకేకు చెందిన ఏషియన్ లైట్ వార్తాపత్రిక కథనం వెల్లడించింది. ఈ వరుస పరిణామాలు పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి.