2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది. సభనుద్ధే శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించను న్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారనే విషయంపై స్పష్టతరావాల్సి ఉంది.
2017 నుంచి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం రావడంతో, బడ్జెట్ ప్రవేశ పెడతారా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవు తుంది. దీనిపై కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
అయితే, వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్తేమీ కాదు. 2016 తొలిసారి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్ను ఆదివారమే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2025లో బడ్జెట్ను నిర్మలమ్మ శనివారం ప్రవేశపెట్టారు. గతంలో ఆదివారాల్లో పార్లమెంట్ సమావేశమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో (2020), అలాగే పార్లమెంట్ తొలి సమావేశం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012, మే13వ తేదీన ఆదివారం నాడు సభ జరిగింది.
ఈ లెక్కన పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరిస్తే, ఆదివారం నాడు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. గతంలో కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున సమర్పించేవారు. దీనివల్ల బడ్జెట్ ఆమోద ప్రక్రియ ఆలస్యమయ్యేది. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ప్రభుత్వ ఖర్చుల కోసం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు వీలుగా పార్లమెంట్ ‘ఓట్ ఆన్ అకౌంట్’ను ఆమోదించాల్సి వచ్చేది.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు శాఖాపరమైన డిమాండ్లను వివరంగా పరిశీలించిన తర్వాత, మిగిలిన సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ఆమెదించేవారు. ఇది తీవ్ర జాప్యాలకు దారితీస్తుండటంతో.. దీన్ని నివారించేందుకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మార్చి 31లోపే బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటుకు తగినంత సమయం లభిస్తుంది.
ఈ బడ్జెట్ సమావేశాల్లో `ఒకే దేశం- ఒకే ఎన్నిక’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 30 రోజులకు పైగా జైలు జీవితం గడిపే ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

More Stories
వీసాలపై భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
ఢిల్లీ మసీదు వద్ద రాళ్లతో దాడి.. ఐదుగురు పోలీసులకు గాయాలు
వైష్ణోదేవి సంస్థ మెడికల్ సీట్ల అనుమతి రద్దు!